స్ట్రెయిన్ వైరస్ తో అప్రమత్తం
కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. వారం రోజుల్లో యూకే నుంచి వచ్చిన వాళ్లను ట్రాక్ చేయనుంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో కరోనా సర్వేలెన్సు ఏర్పాటు చేశారు. అక్కడే ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయడానికి ఏర్పాట్లు చేశారు. పాజిటివ్ వస్తే ఆస్పత్రికి తరలిస్తారు. నెగెటివ్ వస్తే వారం పాటు క్వారంటైన్ విధిస్తారు. స్ట్రెయిన్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయమని తెలిపింది. రేపు రాత్రి నుంచి ఈ నెల 31 వరకు బ్రిటన్కు విమానాలు బంద్ అని తెలిపింది. బ్రిటన్ మీదుగా భారత్కు వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. భారత్ వచ్చాక ఆర్టీ పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
మహారాష్ట్రలో కర్ఫ్యూ
యూకేలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రంతో పాటు, మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో ఈ కర్ఫ్యూను అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర రాజధాని ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటుంది.
ఈ పద్ధతి జనవరి 5 వరకు కొనసాగుతుంది. ఇతర యూరప్ దేశాల నుంచి వచ్చే వారు తప్పకుండా 14రోజుల క్వారంటైన్లో ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కర్ణాటక ప్రభుత్వమూ అలెర్ట్
బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
ఈ నెల 7 నుంచి ప్రయాణికుల వివరాలు ఇవ్వాలని బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలను కోరింది.
బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయాలని ఆదేశించింది. బ్రిటన్ విమానాశ్రయాల నుంచి వచ్చిన వారికే కాకుండా, ఇతర దేశాల్లోని ఎయిర్పోర్టులను నుంచి ప్రయాణించిన వారికి కూడా పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది