వినియోగదారులకు అలర్ట్.... ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే అది తప్పనిసరి...?
ప్రస్తుతం వినియోగదారులు ఏజెన్సీ నెంబర్కు ఫోన్ చేయడం/ యాప్/ ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీ బాయ్ ఇంటికి తెచ్చి సిలిండర్ ఇస్తున్నాడు. కేంద్రం అతి త్వరలో ఈ విధానానికి స్వస్తి పలకాలని భావిస్తోంది. ఇకపై సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీతో కూడిన సందేశం వస్తుంది.
గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ కు వినియోగదారుడు ఓటీపీ నంబర్ ను చెప్పాల్సి ఉంటుంది. డెలివరీ బాయ్ తన స్మార్ట్ ఫోన్ యాప్ లో ఓటీపీ నంబర్ ను ఎంటర్ చేసి అది కరెక్ట్ గా ఉంటే మాత్రమే సిలిండర్ డెలివరీ చేయడం సాధ్యమవుతుంది. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇందుకోసం గ్యాస్ ఏజెన్సీ దగ్గర తమ ఫోన్ నంబర్ ను రిజిష్టర్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ రిజిష్టర్ కాకపోతే సిలిండర్ డెలివరీ సాధ్యపడదు.
కేంద్రం మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ కు ఈ నెలాఖరు వరకు ఢిల్లీ, పలు ప్రాంతాల ప్రజలకు గడువుకు ఇచ్చింది. కేంద్రం మొదట ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావిస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇది అమలు కానుంది. ఈ విధానం ద్వారా గ్యాస్ సిలిండర్ బ్లాక్ మార్కెట్ కు చెక్ పెట్టవచ్చని కేంద్రం భావిస్తోంది. కేంద్రం గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీకి ఓటీపీ తప్పనిసరి చేయడంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.