కృతజ్ఞతా సభలో హుజూర్నగర్ పై వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్...

praveen
వర్షం కారణంగా అంతరాయం కలుగుతుందని అనుకున్న హుజూర్నగర్ కేసీఆర్ కృతజ్ఞతా సభ... విజయవంతం అయ్యింది.  ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్... హుజూర్నగర్ నియోజకవర్గ పై వరాల జల్లు కురిపించారు. హుజూర్నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి నీ భారీ మెజార్టీతో గెలిపించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. హుజూర్నగర్ పరిధిలో 131 గ్రామ పంచాయతీలుండగా...  ఒక్కో గ్రామ పంచాయతీ అభివృద్ధికి   25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. హుజూర్నగర్ పరిధిలో 7 మండల కేంద్రాలకు 30 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపిన కేసీఆర్... మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి 15 కోట్లు మంజూరు చేస్తామన్నారు. 



 ఈ మేరకు త్వరలోనే జీవో జారీ చేస్తామని తెలిపారు కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ  పథకాలు తెలంగాణాలో  అమలు అవుతున్నాయని  కేసీఆర్ తెలిపారు. అయితే చాలా కాలం నుండి హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు చేస్తున్న హుజూర్ నగర్ రెవెన్యూ డివిజన్ డిమాండ్ ను  నెరవేరుస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హుజూర్నగర్ లో పాలిటెక్నిక్ కాలేజీ,  గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల, ఈఎస్ఐ  ఆసుపత్రులను  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.



 హుజూర్నగర్ లో కోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్న కెసిఆర్... త్వరలోనే ప్రజాదర్బార్ ఏర్పాటుచేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా  రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం ఒక్క  తెలంగాణ మాత్రమే  అని అన్నారు. కల్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్, రైతుబంధు,  రైతు బీమా, కేసీఆర్ కిట్ ఇటువంటి అద్భుత పథకాలను ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రవేశపెట్టామని కేసీఆర్ తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా పారదర్శక పాలన అందిస్తున్నామన్న  కేసీఆర్... ఇది చూసి ఓర్వలేక నే ప్రతిపక్షాలు అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే హుజూర్నగర్ లో సైదిరెడ్డి గెలుపు అలాంటి వారికి చెంపపెట్టులాంటిది అని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి కేసీఆర్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: