ఈ రోజుల్లో ప్రేమించుకునేవారికి , పార్కులకు మధ్య చాలా అభినాభావమైన సంబంధం ఉంది . ఈ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ హైదరాబాద్ లోని కొన్ని పార్కుల్లో అయితే లవర్స్ మరీ రెచ్చిపోతుంటారు. కనీసం పార్కులో ఉన్నామన్న ఆలోచన కూడా రాకుండా ప్రవర్తిస్తుంటారు. ఇక నగరంలో లవర్స్ కి అడ్డాగా మారిపోయిన సంజీవయ్య పార్కు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ లవర్స్ కారణంగా సంజీవయ్య పార్క్ కు వచ్చే పెద్దవాళ్లు అలాగే ఫ్యామిలీలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో హెచ్ఎండీఏ ఈ పార్క్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
లవర్స్ రాక వల్ల పార్కులోకి వచ్చే ఇతర సందర్శకులకు ఇబ్బందులు కఏర్పడటంతో సంజీవయ్య పార్కుతో పాటు హెర్బల్ పార్కు, సీతాకోక చిలుకల పార్కు, రోజ్ గార్డెన్, జాతీయ జెండా ప్రాంతాలన్నింటినీ సంజీవయ్య పిల్లల పార్క్ పరిధిలోకి చేర్చుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు సంస్థ కార్యదర్శి ఎం.రాంకిషన్ ఆదేశాలు జారీ చేశారు. 14ఏళ్ల లోపు పిల్లలు, వారి వెంట వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకులకు మాత్రమే పార్క్ లోకి ప్రవేశం కల్పిస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. ప్రవేశ రుసుంను రూ.20 నుంచి రూ.10కి తగ్గించి పిల్లల పార్క్ గా పూర్తిగా మార్చేశారు.
ఉపాధ్యాయుల నేతృత్వంలో వచ్చే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. హుస్సేన్సాగర్ తీరాన గల సంజీవయ్య పార్కులో భారీ జాతీయ జెండాతో పాటు, రోజ్ గార్డెన్, బటర్ ప్లై పార్కు ఉన్నాయి. ఇక తెల్లవారుజామున 5.30గంటల నుంచి ఉదయం 8.30గంటల వరకు యథావిధిగా అన్నీ వయస్సుల వారికి వ్యాయామం కోసం మాత్రం ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నారు. సంజీవయ్య పిల్లల పార్కు వేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే. ఇక పార్కులోకి పొగతాగడం, మద్యం, బయటి తినుబండారాలను అనుమతించకుండా చర్యలు తీసుకోనున్నారు