దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతుంది. కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. లాంటి వాటితో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాజమండ్రి టీడీపీ ఎంపీ, సినీనటుడు మురళీ మోహన్ కోడలు మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కాగా, నిన్న మురళీమోహన్ తల్లి వసుమతిదేవి (100) గురువారం ఉదయం విశాఖపట్నంలో అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే.
మాగంటి రూప ప్రయాణిస్తున్న కారును ఎదురుగా మరో కారు ఢీకొంది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడ్డ రూపను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది.
ఇటీవల రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మురళీ మోహన్ తప్పుకోవడంతో కోడలు రూప పోటీ చేసిన సంగతి తెలిసిందే. మురళీమోహన్ తల్లి వసుమతిదేవి అంత్యక్రియలు ఈరోజు రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు. రూప ఆ కార్యక్రమానికి వెళ్తుండగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.