యాంటీ సెంటిమెంట్ గేమ్ మొదలెట్టిన రాజమౌళి.. ఇది వర్కౌట్ అవుతుందా?

Thota Jaya Madhuri
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌ సినిమా గురించి ప్రేక్షకుల్లో నెలకొన్న ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఈ కాంబినేషన్‌లో ఏం జరుగుతుందో, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రతి సినీ ప్రేమికుడి నోట ఉన్న హాట్ టాపిక్‌. ఆర్ఆర్ఆర్‌ తర్వాత రాజమౌళి తీస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన మొదటి అధికారిక లుక్‌ రిలీజ్‌ చేయడం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ‘కుంభ’గా నటిస్తున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాత్ర పరిచయం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఆ లుక్‌తో పాటు సూపర్‌స్టార్ మహేష్‌బాబు ట్వీట్‌ చేసిన మాటలు కూడా బాగా వైరల్‌ అయ్యాయి —“నేను అవతలి వైపు ఉన్నాను... ఈ కుంభతో నేరుగా కలిసే సమయం ఆసన్నమైంది అంటూ పోస్ట్ చేశారు.



”మహేష్ ఈ మాటలతో సినిమా టోన్‌పై క్లూ ఇచ్చినట్టే అయ్యింది. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది పృథ్వీరాజ్‌ లుక్‌. ఆయన వీల్‌చైర్‌పై కూర్చుని ఉన్నాడు. కాళ్లు, చేతులు చచ్చుబడి ఉన్నట్టే కనిపిస్తున్నా, ఆ వీల్‌చైర్‌ సాధారణం కాదు — అది సైంటిఫిక్‌ పవర్‌తో నిండిన ‘మిషన్‌ చెయిర్‌’లా కనిపిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో రోబోటిక్స్‌, మిషినరీ, సైన్స్‌ ఫిక్షన్‌ ఎలిమెంట్స్‌ కనిపించడం రాజమౌళి సినిమాలో మరో లెవెల్‌ యాంటీ క్యారెక్టర్‌ సెట్‌అప్‌ ఉన్నట్టు సూచిస్తోంది.అయితే ఇక్కడే ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది — వీల్‌చైర్‌లో కూర్చున్న విలన్‌ పై ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతారా? లేక జాలిపడతారా?



ఇదే ప్రశ్నను ఒకప్పుడు ‘ఒక్కడున్నాడు’ సినిమా సమాధానంగా మిగిలింది. దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి తీసిన ఆ చిత్రం టాలీవుడ్‌లో విలన్‌ కాన్సెప్ట్‌కి ఒక కొత్త దారితీసింది. ఆ సినిమాలో విలన్‌ పాత్రకు ఉన్న నిస్సాయత, అవిటితనం వేరు రేంజ్‌లో ఉన్నా, ఆడియన్స్‌ సింథసైజ్‌ కాలేకపోయారు. ఎందుకంటే విలన్‌ శారీరకంగా బలహీనుడు, కానీ భావోద్వేగంగా బలమైనవాడు. ప్రేక్షకులు ఆయన పట్ల జాలి చూపారు. దాంతో హీరోపై రావాల్సిన సింపతీ తగ్గిపోయింది. అదే సినిమాకు ప్రధానమైన బలహీనత అయింది. ఈ ఉదాహరణను రాజమౌళి ఒక సందర్భంలో ప్రస్తావించినట్లు కూడా సమాచారం ఉంది. ఆయన మాటల్లో — “విలన్‌ ఎంత బలహీనంగా కనిపించినా, ఆత్మవిశ్వాసంలో బలంగా ఉండాలి. హీరోకి సవాలు విసరగల శక్తి ఉండాలి.” అని అన్నారు.



అందుకే రాజమౌళి ఇప్పుడు ఇలాంటి లుక్‌ వదిలినా, ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి. వీల్‌చైర్‌లో ఉన్న కుంభ కూడా సాధారణ విలన్‌ కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన శరీరం బలహీనంగా ఉన్నా, టెక్నాలజీ, మైండ్‌, మిషన్‌ – ఇవన్నీ కలిపి ఒక కొత్త తరహా విలన్‌ రూపకల్పన అయి ఉండొచ్చు.ఇది ‘యాంటీ సెంటిమెంట్ గేమ్‌’ — విలన్‌పై జాలి రాకుండా, అదే సింపతీని హీరో వైపుకు మళ్లించే రాజమౌళి కొత్త ప్లాన్‌ అయి ఉండవచ్చు. రాజమౌళి ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలోనూ విలన్‌ క్యారెక్టర్‌కి ప్రత్యేకమైన డెప్త్‌ ఉంటుంది. ‘ఈగ’లో సుదీప్‌, ‘బాహుబలి’లో భల్లాలదేవ, – అందరూ ఒక్కోసారి హీరోల కంటే ఎక్కువ ఇంపాక్ట్‌ చూపించారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు వీల్‌చైర్‌ విలన్‌ని ఎంచుకున్నాడంటే దానికి వెనక తప్పకుండా ఒక సైన్స్‌, ఒక సైకాలజీ ఉంటుంది.రాజమౌళి తీసిన ప్రతి అడుగు వెనుక లెక్క ఉంటుంది. కాబట్టి ఈ వీల్‌చైర్‌ విలన్‌ కూడా టాలీవుడ్‌కి కొత్త మలుపు తిప్పే పాత్ర అవ్వడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: