త్రివిక్ర‌మ్ - రామ్ చ‌ర‌ణ్‌ను క‌లుపుతోన్న ఆ నిర్మాత కొడుకు..?

Kavya Nekkanti
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఆరాటపడుతున్నారు. అయితే అభిమానుల కోరిక త్వరలో నెరవేరడం ఖాయంగా కనిపిస్తోంది. త్రివిక్రమ్, రామ్ చరణ్ ను కలిపేందుకు ఓ నిర్మాత తనయుడు ప్లాన్ చేస్తున్నారు. ఆయనే చందన్ రెడ్డి. దివంగత నిర్మాత శివప్రసాద్ రెడ్డి తనయుడే చందన్ రెడ్డి. శివప్రసాద్ రెడ్డి స్థాపించిన నిర్మాణ సంస్థ కామాక్షి మూవీస్.


ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి 1986-2013 మధ్యన చాలా చిత్రాలే వచ్చాయి. ముఖ్యంగా కామాక్షి మూవీస్ నిర్మాణ సంస్థలో అక్కినేని నాగార్జున ఏకంగా 12 చిత్రాలు చేశారు. నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన `సీతారామరాజు`, `నేనున్నాను`, `బాస్‌` వంటి సినిమాలన్నీ శివప్రసాద్ రెడ్డినే నిర్మించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్ మూవీ `ముఠా మేస్త్రి` కూడా కామాక్షి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైంది. అలాగే `పౌరుడు`,  `పంచాక్షరి`, `ఆఫీసర్` వంటి చిత్రాలను ఈ నిర్మాణ సంస్థ పంపిణీ కూడా చేసింది. అయితే ఒక దశ నుంచి కామాక్షి మూవీస్‌ సంస్థ లాభాల కన్నా నష్టాలనే ఎక్కువ చూసింది. దాంతో 2013 నుంచి శివ ప్రసాద్రెడ్డి నిర్మాణం ఆపేశారు. కొంతకాలానికి ఆయన గతించారు.


అయితే ఇప్పుడు ఆయ‌న తనయుడు చందన్ రెడ్డి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన వివేక్ కూచిభొట్ల‌తో కలిసి సినిమాల నిర్మాణానికి రెడీ అయ్యారు. అందులో భాగంగానే కిరణ్ అబ్బవరం, సాయి ధరమ్ తేజ్‌ లతో బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలను ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ పై అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. ఇక మరోవైపు రామ్ చరణ్ కు చందన్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్. ఈ బాండింగ్‌ తోనే రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తీయాలని చందన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడట. మరి ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి. అదేవిధంగా చందన్ రెడ్డి తన తండ్రి స్థాపించిన కామాక్షి మూవీస్ బ్యానర్ నే ముందుకు తీసుకెళ్తాడా? లేక కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తాడా? అన్నది కూడా తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: