అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా హీరో అవుతారు: బోయపాటి

Suma Kallamadi
మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలయ్య - బోయపాటి శ్రీను కాంబో గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కలయికలో సినిమా వస్తోంది అంటే నందమూరి అభిమానులకు ఇక పండగ వచ్చేసినట్టే. మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో బోయపాటిది చాలా ప్రత్యేకమైన శైలి. అలాంటి ఈ ఇద్దరు జతకడితే మామ్ములుగా ఉంటుందా? దబిడి దిబిడే కాదూ! సింహా, లెజెండ్, అఖండ వంటి వరుస 3 చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఈ ద్వయం మరోసారి జతకట్టడం ఇపుడు టాలీవుడ్ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా అఖండ సినిమాతో తెలుగు రాష్ట్రాలతో పాటుగా హిందీ సర్కిల్స్ కూడా ఓ మాదిరిగా ఆడింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ నాలుగోసారి కలిసిన అఖండ 2 ద్వారా, పాన్-ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే అఖండ కథకు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టైటిల్‌ను అఖండ 2 గా ఫిక్స్ చేశారు మేకర్స్. కాగా తాజాగా విడుదల అయిన అఖండ 2 టైటిల్ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పోస్టర్‌లోని శివలింగం మరియు క్రిస్టల్ లింగం బొమ్మలు ఆధ్యాత్మికతను ప్రతిబింబించాయి. అలాగే, పోస్టర్‌కు జోడించిన తాండవం అనే ట్యాగ్‌లైన్‌తోపాటు డమరుకం బొమ్మలు చాలా ఆకర్షిణీయంగా ఉన్నాయి. మొత్తంగా బాలకృష్ణను పరిపూర్ణమైన పౌరాణిక శక్తితో తెరపై చూపించడంలో బోయపాటి శ్రీనుది ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవచ్చు. కాగా ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట మరియు గోపీ అచంట నిర్మిస్తున్నారు. అఖండ 2 అత్యంత భారీ బడ్జెట్‌తో వీరి కెరీర్‌లో అత్యంత ఖరీదైన సినిమా కానుంది.
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు బోయపాటి బాలయ్యను ఉద్దేశిస్తూ... అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా హీరో ఖచ్చితంగా అవుతారు.. ఇక కాసుకోండి! అంటూ మిగతా హీరోలకు సవాల్ విసిరారు. ఇక ఈ సినిమాకి ఎస్. థమన్ మరోసారి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. సి. రామప్రసాద్ కెమెరామెన్ గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, తమ్మిరాజు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కాగా అఖండ సీక్వెల్‌లో మరింత ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉండబోతాయని చిత్రబృందం వెల్లడించింది. ఈ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: