దంగల్ దర్శకుడి రామాయణంకి ఇంట్రెస్టింగ్ టైటిల్?

Purushottham Vinay
బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమా 'దంగల్' డైరెక్టర్ నితీష్ తివారి తీస్తున్న రామాయణంకి సంబంధించిన కొత్త ట్విస్టులు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏకంగా 800 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాగాలుగా రామాయణం తెరకెక్కనుందని ఇంతకుముందు మేకర్స్  బడ్జెట్ ని వెల్లడించిన సంగతి తెలిసిందే.భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ లలో ఒకటిగా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం సాగుతోంది. దర్శకుడు నితీష్ తివారీ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా గ్రాండ్ సిరీస్ గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. సెట్ నుండి ఇటీవల లీక్ అయిన పిక్స్ వైరల్ అయ్యి ఇప్పటికే ఆసక్తిని పెంచాయి. ఇందులో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా లారా దత్తా తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.అయితే ఈ మూవీ ఇబ్బందుల్లో పడిందంటూ ఇటీవల కొత్త ట్విస్టు వెలుగు చూసింది. అల్లు అరవింద్- మధు మంతెన టీం ప్రైమ్ ఫోకస్ మీడియాతో ఒప్పందంలో భాగంగా తమకు చెల్లించాల్సినది ఇంకా చెల్లించలేదని, దీనిపై న్యాయపోరాటం సాగించేందుకు సిద్ధమవుతున్నామని ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి.


 ఈ సినిమా మేధో సంపత్తి హక్కులకు సంబంధించి చెల్లింపులు తాము పొందలేదని అల్లు మంతెన మీడియా వెంచర్స్ ఎల్‌ఎల్‌పి పబ్లిక్ నోటీసును జారీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి.ఇదిలా ఉండగానే.. రామాయణం గురించిన తాజా గాసిప్స్ వేడెక్కిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రైమ్ ఫోకస్ సంస్థ 'రామాయణం' టైటిల్ ని మార్చే ప్రయత్నాల్లో ఉందని, దీనిని 'గాడ్ పవర్‌' అనే టైటిల్ తో నిర్మించనుందని వార్తలు వస్తున్నాయి. అలాగే 'ది కేరళ స్టోరీ'సినిమాలో అద్భుత నటనతో ఆకట్టుకున్న సోనియా బాలా ఈ మూవీలో చేరినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నుంచి ప్రభాస్ ముఖ్య పాత్రలో ఆది పురుష్ సినిమా ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయింది. గ్రాఫిక్స్ పై దేశావ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.ఇక నితీష్ తివారి రామాయణం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: