ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు అల్లు అర్జున్‌ కారణం అదేనా..???

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్' సినిమాతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'పుష్ప 1'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన బన్నీ..ఇప్పుడు 'పుష్ప 2' చిత్రంతో గ్లోబల్ వైడ్ గా సందడి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారు. సినిమాకు, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కు లింకేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చూసేయండి. అల్లు అర్జున్ నిన్న బుధవారం (మార్చి 20) హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసుకు వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకునేందుకు ఆర్టీఓ అధికారులను కలిశారు. లైసెన్స్ తీసుకోవడానికి అవసరమైన అప్లికేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసారు బన్నీ. సంబంధిత డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి వారికి అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పుష్పరాజ్ రాకతో ఆర్టీఏ ఆఫీసులో సందడిగా మారింది. బన్నీని చూసేందుకు జనం గుమిగూడారు. సెల్ఫీ ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో కాసేపు ఆర్టీఏ ఆఫీస్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం. ఇక అసలు విషయానికొస్తే, అల్లు అర్జున్ కు ఇప్పుడు ఉన్నట్టుండి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు అవసరమైంది? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇదంతా 'పుష్ప 2' కోసమే అయ్యుంటుందని చర్చించుకుంటున్నారు. ఫారిన్ షెడ్యూల్ లో ఏమైనా యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారేమో అని భావిస్తున్నారు. విదేశీ రోడ్ల మీద తిరగాలంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి, అందుకే దరఖాస్తు చేసుకున్నారేమో అని కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల జర్మనీలో జరిగిన బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా బన్నీ మాట్లాడిన మాటలు చూస్తే, ఇది నిజమేనేమో అనిపిస్తుంది.
'పుష్ప 1'తో పోల్చి చూస్తే 'పుష్ప 2' చాలా పెద్ద కాన్వాస్లో ఉండబోతోందని అల్లు అర్జున్ చెప్పారు. సీక్వెల్ లో చాలా భిన్నమైన షేడ్స్ ఉంటాయని, క్యారెక్టరైజేషన్ పరంగా సెకండ్ పార్ట్ లో స్పెక్ట్రం హయ్యెస్ట్ ఎండ్ ను చూస్తారని అన్నారు. మొదటి భాగం ప్రాంతీయ స్థాయిలో ఆడితే, ఇప్పుడు రెండో భాగం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడుతుందని బన్నీ ఆశాభావం వ్యక్తం చేసారు. హీరో విలన్ల మధ్య వివాదం ఈ సినిమాలో చాలా పెద్దగా ఉండబోతోందని చెప్పిన అల్లు అర్జున్.. రానున్న రోజుల్లో 'పుష్ప 3' కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. సో 'పుష్ప 2' కోసం బన్నీ టీమ్ గట్టిగానే ప్లాన్స్ చేశాయని అర్థమవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు, బ్రహ్మాజీ, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేషాచలం అడవుల్లో కూలీగా జీవితం ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ స్థాయికి ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' లో చూపించారు. ఇప్పుడు పార్ట్ 2లో సిండికేట్ ను ఎలా శాసించాడనేది చూపించబోతున్నారు. దీని కోసం విదేశాల్లోనూ షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం.
'పుష్ప 2' కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ ను అందుకోవడం కోసం చిత్ర బృందం శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇటీవల జరిగిన వైజాగ్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. యాగంటి షూటింగ్ లో రష్మిక లుక్ కూడా రివీల్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: