అనారోగ్యమే ప్రముఖ హాస్య నటుడి పాలిట శాపమా... సాయం చేసేవారే లేరా?
'మళలై పట్టాలం' అనే తమిళ సినిమా తో 1979 లో హాస్య నటుడుగా కోలీవుడ్ లో తన సినీ కెరీర్ ప్రారంభించిన నటుడు గుండు కళ్యాణం ఆ తర్వాత వరుస చిత్రాలతో బాగా పాపులర్ అయ్యారు. అతడి కామెడీ టైమింగ్, ఆహార్యం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవి. దాంతో వరుస ఛాన్సులు పెరిగాయి అలా దాదాపుగా 500కు పైగా సినిమాల్లో నటుడిగా, హాస్య నటుడిగా చేశారు గుండు కళ్యాణం. కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రాజకీయ పార్టీ అన్నాడీఎంకే వీరాభిమానిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అన్నాడీఎంకే పేరు వస్తే ఆయన డై హార్డ్ ఫ్యాన్ గుండు కళ్యాణం అని గుర్తొచ్చేలా కొనసాగారు. దివంగత నటులు జయలలిత మరియు ఎంజీఆర్ ల మీద ఉన్న అభిమానంతో అన్నాడీఎంకేలో చేర ఆ పార్టీ తరుపున ఎన్నో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ముఖ్య పాత్ర వహించారు.
పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎంతో కృషి చేశారు. అయితే ఈ మధ్య ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్ కు వెళ్లగా ఆయనకు కిడ్నీ సమస్య ఉందని తెలిసింది. ప్రతి రెండు రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి సారి చికిత్స చేయించుకోవడానికి తగిన ఆర్ధిక అండ లేకపోవడంతో ఆయన ఇబ్బందిపడుతున్నారు అని దివంగత జయలలిత వద్ద సహాయకుడిగా పనిచేసినటువంటి పూంగుడ్రన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎవరైనా ముందుకు వచ్చి సహాయాన్ని అందించాలని కోరారు. ఒకవేళ జయలలిత కనుక జీవించి ఉంటే గుండు కళ్యాణంకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరించేవారని, కానీ ఇపుడు ప్రస్తుతం సమయంలో అన్నాడీఎంకే కార్యకర్తలైనా ముందుకొచ్చి తమకు వీలైనంతలో సహాయం అంచాలని కోరారు.