ప్రజల కోసమే సేవ చేయడానికి వచ్చిన సీఎం.. మహేష్.
2015లో శ్రీమంతుడు సినిమాతో కొరటాల శివ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు అలాగే కొరటాల శివ కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో ఇంకో సూపర్ హిట్ కొట్టాలని ఎంతో మంది నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ ఈ అవకాశాన్ని మాత్రం డి.వి.వి.దానయ్య చేజిక్కించుకున్నారు. ఇక 2016 జూన్ లో కొరటాల శివ - మహేష్ బాబు కాంబినేషన్ లో మరో సినిమా అఫీషియల్ ప్రకటన వచ్చింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ను ఎలా చూపించాడో, అంతకంటే గొప్పగా మహేష్ బాబు ను ఇప్పుడు తీయబోయే సినిమాలో చూపించాలని అనుకున్నాడు కొరటాల శివ.
అయితే మొదట ఈ సినిమాకు హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు వినిపించింది. ఆ తర్వాత దిశాపటాని పేరు కూడా వార్తల్లోకెక్కింది. కానీ చివరకు కియారా అద్వానీ ఈ అవకాశాన్ని కొట్టేసింది. కియారాకు ఇదే మొదటి తెలుగు సినిమా. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ,దేవరాజ్, పోసాని, రవిశంకర్, బ్రహ్మాజీ లాంటి మొత్తం 40 మంది స్టార్ ఆర్టిస్టులతో క్యాస్టింగ్ రెడీ చేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే కొన్ని అనుకోని కారణాల చేత ఈ సినిమా టైటిల్ ముందుగానే లీకై ,ఇక ఈ సినిమాలో మహేష్ పాత్ర సీఎం అని కూడా లీక్ అయ్యి, మహేష్ ఫ్యాన్స్ ను ఆకాశంలో తేలేలా చేసింది. ఈ సినిమా ఆడియో లాంచ్ కు ఎన్టీఆర్ రావడం మరో విశేషం.చివరిగా ఈ సినిమాను 2018 ఏప్రిల్ 20వ తేదీన అట్టహాసంగా విడుదల చేశారు.
అనవసరమైన హీరోయిజం, కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా ఏ రాజకీయ పార్టీని కించపరచకుండా అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో సీఎం పాత్రలో మహేష్ బాబు డీసెంట్ గా అదరగొట్టాడు. ఈ సినిమాకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు.. కేటీఆర్ తో సహా పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు సినీ కెరీర్లో 100 కోట్ల షేర్ ను వసూలు చేసిన మొదటి సినిమా ఇది. అలాగే యూఎస్ లో త్రీ మిలియన్స్ వసూలు చేయడం మరో రికార్డు. కొన్నిచోట్ల బాహుబలి2 రికార్డులను కూడా బ్రేక్ చేసింది. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే వంద కోట్ల షేర్ని రాబట్టిన సినిమాగా రెండవ స్థానాన్ని దక్కించుకుంది.