అత్యధిక పాటలు పాడిన ఏకైక గాయకుడు..!

NAGARJUNA NAKKA
అత్యధిక పాటలు పాడిన ఏకైక గాయకుడిగా ఎస్పీ బాలు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు. అదొక్కటే కాదు.. భారత అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్‌తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పురస్కారాలను లెక్కలేనన్ని అందుకున్నారు బాలు.! ఎన్నో నేషనల్ అవార్డులు, నంది అవార్డులు బాలు సొంతమయ్యాయి. 2016లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్ అవార్డును అందుకున్నారు గానగంధర్వుడు.

కేవలం పాటలకే బాలు పరిమితం కాలేదు. సుమారు వందకు పైగా సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పారు. కమల్‌హాసన్, రజనీకాంత్, సల్మాన్‌ఖాన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి ఎంతో మంది కళాకారులు తమ కంఠాన్ని బాలు గొంతులో చూసుకున్నారు.

బాలు కేవలం సింగర్ మాత్రమే కాదు. మంచి నటుడు కూడా.! సుమారు 45 సినిమాల్లో బాలు తన నటనాకౌశలాన్ని ప్రదర్శించారు. కొన్ని సినిమాల్లో కథానాయకుడిగా, మరికొన్నింటిలో సపోర్టింగ్‌ యాక్టర్‌గా నటించారు. 2012లో తనికెళ్ల భరణి దర్శకత్వం వహించిన మిథునం సినిమా బాలు నటనకు మంచి పేరు తెచ్చింది. నంది పురస్కారమూ వరించింది.

సింగర్‌గా, యాక్టర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మాత్రమే కాదు.. బుల్లితెరపై యాంకర్‌గా కూడా బాలు కనిపించారు. ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమానికి ఆయన సారథ్యం వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది వర్ధమాన గాయనీగాయకులు సినీరంగానికి పరిచయమయ్యారు. స్వరాభిషేకం కార్యక్రమంలో వర్ధమాన గాయనీగాయకులతో కలిసి వేదిక పంచుకున్నారు.

సంగీతంలో శిఖరసమానుడైన బాలు 45కు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు. ఆయన గాత్రమే కాదు.. ఆయన బాణీలు కూడా సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా బాలసుబ్రమణ్యం పలు పురస్కారాలను అందుకున్నారు.

సినిమా ప్రపంచంలో బాలసుబ్రమణ్యంది చెరగని ముద్ర.! ఎవరికీ సాధ్యం కాని చరిత్ర..! అందుకే ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగిన బాలును శిఖరసమానుడిగా పోల్చుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: