టాలీవుడ్ లోకి పదేళ్ల విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు రైతులకు మంచి మెసేజ్ ఉండటంతో సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా ఆనాటి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ స్ఫూర్తిగా ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మరో మూవీకి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. టాలీవుడ్ లోకి రచయితగా వచ్చిన కొరటాల ‘మిర్చి’సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ఫ్యాక్షన్ రాజకీయాల మార్పు ఎలా తీసుకు రావాలో చాలా బాగా చూపించారు. ఆ తర్వాత గ్రామాల దత్తత పై మహేష్ బాబు హీరో ‘శ్రీమంతుడు’సినిమా, తమ చుట్టు ఉన్న సమాజాన్ని ఎలా రక్షించుకోవాలి..పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి అన్న నేపథ్యంలో ‘జనతా గ్యారేజ్’సినిమా, నేటి రాజకీయల తీరు పై మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’ సినిమాలు తీసి ఘన విజయాన్ని అందుకున్నాడు.
ఇప్పుడు మరో రైతు కథతో మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయడానికి సిద్దంగా ఉన్నారు కొరటాల. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేసేశాడు. కాగా, ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరిని తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన కథానాయికగా మొదటి నుంచి కూడా నయనతార పేరే వినిపిస్తోంది. మరో కథానాయికగా తమన్నాతోను సంప్రదింపులు జరుగుతున్నాయట. గత కొంత కాలంగా తమన్నాకు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేకపోవడం..సైరాలో ఈ ఇద్దరు భామలు ఉండటం..తన సినిమాకు ప్లస్ అవుతుందన్న భావనలో ఉన్నారు కొరటాల. ఒకవేళ నయన్ ఒప్పుకోకపోయినా..మరో సీనియర్ కథానాయకిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.