సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాడ్ సెక్స్ ట్రూత్’ (జీఎస్టీ) నేడు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే నిన్న వర్మకు కోర్టు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీ విషయమై ఆర్జీవీ నోటీసులు అందాయి. ఆర్జీవీ తెరకెక్కించిన జీఎస్టీ షార్ట్ఫిల్మ్ కాన్సెప్ట్ తనదేనని రచయిత పి. జయకుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని పరిగణలోనికి తీసుకున్న కోర్టు గురువారం మధ్యాహ్నం ఆర్జీవీకి నోటీసులు పంపింది. మూడు రోజుల్లోగా ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
"2015 ఏప్రిల్ 1న ప్రస్తుతం వర్మ తెరకెక్కించిన జీఎస్టీ స్క్రిప్ట్ను నేను వర్మకు పంపాను. వర్మ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని చాలా రోజులుగా వేచి చూశాను. కానీ 2015 నుంచి నేటి వరకూ వర్మ నుంచి స్పందన రాకపోగా నా స్క్రిప్ట్ను కాపీ కొట్టి ఆయన ఏకంగా లఘు చిత్రాన్నే తెరకెక్కించేశారు. సేమ్ టూ సేమ్ ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా తెరకెక్కించేశారు. ఇదే విషయాన్ని పిటిషన్లో పేర్కొన్నాను. కోర్టును ఆశ్రయించగా ఆర్జీవీకి నోటీసులు పంపడం జరిగింది.
న్యాయస్థానంపై నాకు నమ్మకముంది.. నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను"అని రచయిత జయకుమార్ మీడియాకు వెల్లడించారు. దీనిపై స్పందించిన రాంగోపాల్ వర్మ.. జై కుమార్ వి తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పిన వర్మ, ఆయన తన కార్యాలయంలో పని చేసిన మాట మాత్రం నిజమేనని అన్నాడు.
అతను ఓ దొంగని, తన ఆఫీసులో పలుమార్లు దొంగతనం చేస్తూ జై కుమార్ పట్టుబడ్డా వదిలేశానని, చివరకు 10 నెలల క్రితమే తన బృందం నుంచి తొలగించానని అన్నాడు. ఇప్పుడిక అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నానని చెప్పాడు.