రష్మిక విషయంలో క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య....!!

murali krishna
తమిళ్‌లో హీరోయిన్‌గా స్థిరపడిన ఐశ్వర్య రాజేష్ .. తెలుగులోనూ రెండు మూడు చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలేవీ తనకు టాలీవుడ్‌లో కమర్షియల్‌ బ్రేక్ ఇవ్వలేకపోయాయి. అయితే తమిళ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఐశ్వర్య లేటెస్ట్ మూవీ ‘ఫర్హానా’  ఇటీవలే విడుదలైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నెల్సన్ వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదలైంది. ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా.. ‘పుష్ప’  చిత్రంలో రష్మిక చేసిన శ్రీవల్లి  క్యారెక్టర్‌ను తను బాగా చేసేదాన్నని చెప్పింది. ఈ కామెంట్ రష్మిక ఫ్యాన్స్‌కు కోపం తెప్పించడంతో వివాదాస్పదమైంది. దీనిపై తాజాగా స్పందించిన ఐశ్వర్య.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చింది.
శ్రీవల్లి క్యారెక్టర్ విషయంలో ఐశ్వర్య చేసిన కామెంట్స్‌కు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. దీంతో క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య.. రష్మికపైనే కాకుండా ఆమె పని పట్ల తనకు అమితమైన ప్రేమాభిమానం ఉందని చెప్పింది. ఆ రోజు ఇంటర్వ్యూలో తెలుగు ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారనే ప్రశ్నకు బదులిచ్చాను. ‘నాకు తెలుగు సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టమని, నాకు నచ్చిన పాత్రలు వస్తే తప్పకుండా ఇక్కడ సినిమాలు చేస్తానని’ చెప్పాను. ఎగ్జాంపుల్‌గా ‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్ర చాలా నచ్చిందని, అలాంటి పాత్రలకు తాను పర్ఫెక్ట్‌గా సరిపోతానని మాత్రమే చెప్పినట్లుగా వివరించింది.
అయితే, దురదృష్టవశాత్తు తన స్టేట్‌మెంట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ఐశ్వర్య.. ‘పుష్ప’ చిత్రంలో రష్మిక అద్భుతంగా నటించిందని, కానీ నెట్టింట మాత్రం నేను ఆమెను కించపరుస్తూ మాట్లాడినట్లుగా వక్రీకరించారని పేర్కొంది. ‘ఈ సినిమాలో రష్మిక చేసిన పని పట్ల నాకు ప్రగాఢమైన అభిమానం తప్ప మరేమీ లేదు. నా తోటి నటీనటులు అందరిపై నాకు అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేయాలనుకుంటున్నాను’ అంటూ ఒక నోట్ కూడా షేర్ చేసింది ఐశ్వర్య.
ఇదిలా ఉంటే, ఐశ్వర్య రాజేష్ తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ చిత్రంలోనూ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: