మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పడుతున్న మురుగదాస్.. ఆ స్టార్ హీరోతో సినిమా..?

Anilkumar
కోలీవుడ్ అగ్ర దర్శకుడు మురగదాస్ ఎట్టకేలకు తాజాగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు మూడు సంవత్సరాల విరామం తర్వాత మెగా ఫోన్ పడుతున్నాడు ఈ తమిళ దర్శకుడు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'దర్బార్' సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు మురుగదాస్. మళ్లీ ఎప్పుడు సినిమా తీస్తాడా అని ఎదురు చూస్తున్న తరుణంలో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమాను లైట్ హౌస్ మూవీ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం.తమిళంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. 

త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల ప్రిన్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని అందుకున్నాడు. తెలుగుతో పాటూ తమిళంలో కూడా విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ప్రస్తుతం శివ కార్తికేయన్ తమిళంలో 'అయిలాన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి అవగా.. తాజాగా 'మావీరన్'సినిమాలో నటిస్తున్నాడు.

 ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే మురగదాస్తో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇక మురగదాస్ 2020లో సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్బార్ అనే సినిమాని తీశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా పరాజయంతో మురగదాస్ తన కెరీర్ లోనే లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. సుమారు మూడేళ్ల తర్వాత ఇప్పుడు శివ కార్తికేయన్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. నిజానికి ఇటీవల తళపతి విజయ్తో ఓ సినిమా తీయాలనుకున్నాడు మురగదాస్. కానీ ఎందుకనో ఆ సినిమా ఓకే కాలేదు. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టులు అనుకున్నా.. అవి కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. దీంతో ఎట్టకేలకు శివ కార్తికేయన్ తో సినిమా చేయబోతుండటంతో ఈ ప్రాజెక్టు పై కోలీవుడ్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి సినిమా కావడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: