మన చిత్రాలకు అక్కడ అంత డిమాండ్ ఉందా..?

NAGARJUNA NAKKA
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' సినిమా బాలీవుడ్‌ని వెర్రెక్కించింది. నార్త్‌ మార్కెట్‌లో 100 కోట్ల వరకు వసూల్ చేసి, ట్రేడ్‌ పండిట్స్‌ని కూడా ఆశ్చర్యపరిచింది. ఒమిక్రాన్‌ భయం ఉన్నా, 50 పర్సంట్‌ ఆక్యుపెన్సీ రేషియో నిబంధనలు ఉన్నా ఇంత భారీగా వసూళ్లు ఎలా వచ్చాయి అని హిందీ జనాలు కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. 'పుష్ప' మాత్రమే కాదు, సౌత్‌ నుంచి బాలీవుడ్‌కి వెళ్తోన్న మాస్‌ సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. అక్కడ భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. 'బాహుబలి' ప్రాంచైజీ నార్త్‌లో వేల కోట్లు అందుకుంది. ఇప్పటికీ 'బాహుబలి' రికార్డ్‌ని హిందీ సినిమాలు బ్రేక్ చేయలేకపోతున్నాయి.  
కన్నడ సినిమాలు బయట మార్కెట్స్‌లో పెద్దగా వసూల్ చేయలేనని ఒక నెగటివ్‌ ఒపీనియన్‌ ఉంది. కన్నడ సినిమాలని చిన్న సినిమాలుగా చూస్తుంటారు. అయితే ఈ కామెంట్స్‌ అన్నింటిని బ్రేక్ చేసింది 'కెజిఎఫ్'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యశ్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీగా వసూల్ చేసింది. ఈ మాసీ యాక్షన్‌ మూవీతో యశ్‌కి నార్త్‌లో ఫాలోయింగ్‌ కూడా వచ్చింది. బాలీవుడ్‌ స్టార్లు ఎక్కువగా మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌నే టార్గెట్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలంతా మెట్రోపాలిటన్ కథల్లోనే నటిస్తున్నారు. దీంతో బీ, సీ సెంటర్స్‌లో బాలీవుడ్ హీరోల గ్రాఫ్‌ పడిపోతోంది. వ్యాక్యూమ్‌ కూడా క్రియేట్ అవుతోంది. ఈ గ్యాప్‌నే సౌత్‌ సినిమాలు క్యాష్‌ చేసుకుంటున్నాయి. మాస్‌ కథలతో మాసివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి.
'బాహుబలి'తో బాలీవుడ్‌లో రాజమౌళికి క్రేజీ ఫాలోయింగ్ వచ్చింది. దీంతో జక్కన్న సినిమా అనగానే నార్త్‌లో కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ బజ్‌తోనే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా లార్జ్‌ స్కేల్‌లో రిలీజ్ అవుతోంది. ఇక రాజమౌళి కూడా ఈ సినిమాని హిందీ ఆడియన్స్‌కి మరింత చేరువ చేసేందుకు ఒక రేంజ్‌లో ప్రమోట్‌ చేశాడు. ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. 'కెజిఎఫ్'కి భారీ రెస్పాన్స్‌ వచ్చాక, ప్రశాంత్‌ నీల్ హిందీ మార్కెట్‌పై మరింత ఫోకస్ పెట్టాడు. నార్త్‌ వసూళ్లని మరింత పెంచుకోవడానికి 'కెజిఎఫ్2'కి బాలీవుడ్‌ కోటింగ్‌ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సంజయ్‌ దత్‌తో మెయిన్‌ విలన్‌ క్యారెక్టర్ చేయించిన ప్రశాంత్ నీల్, ఒక కీ-రోల్‌ కోసం రవీనా టాండన్‌ని తీసుకున్నాడు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదలవుతోంది. నార్త్‌లో సౌత్‌ సినిమాలకి వస్తోన్న వసూళ్లు చూసి బోనీ కపూర్‌ కూడా మన సినిమాలని ముంబాయికి తీసుకెళ్తున్నాడు. అజిత్‌ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో 'వలీమై' సినిమాని నిర్మించాడు బోనీ కపూర్. ఈ తమిళ్‌ సినిమాని తెలుగుతో పాటు, హిందీలో కూడా రిలీజ్‌ చేస్తున్నాడు బోనీ కపూర్. ఫిబ్రవరి 24న 'వలీమై'  విడుదలవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: