చిరంజీవి పాతగాయాన్ని రేపిన మాజీ హీరోయిన్..

Deekshitha Reddy
చిరంజీవి కెరీర్ లో భారీ హిట్లు ఉన్నట్టే.. అతి పెద్ద డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు టీవీల్లో చూస్తుంటే బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి కానీ, అప్పట్లో బాక్సాఫీస్ రేసులో అవి వెనకబడ్డాయనేది మాత్రం వాస్తవం. అలాంటి సినిమాల్లో ఒకటి మృగరాజు. సరిగ్గా సంక్రాంతి సీజన్లో వచ్చిన మృగరాజు సినిమా అప్పటి బాక్సాఫీస్ రేసులో వెనకబడింది. చిరంజీవి చేసే పోరాటాలు, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. అయితే ఆ సినిమా గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. ఇప్పుడా సినిమా గాయాన్ని మళ్లీ తిరిగి రేపారు మాజీ హీరోయిన్ సిమ్రన్.
ఇటీవల సిమ్రన్ తన ట్విట్టర్ అకౌంట్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. రీఎంట్రీతో మెరుపులు మెరిపించాలని చూస్తున్న సిమ్రన్ తన పాత సినిమాల విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని పాత సినిమాల రిలీజ్ డేట్లకు తగ్గట్టుగా ఆమె ట్వీట్లు వేస్తున్నారు. అందులో ఆమె మృగరాజు సినిమాపై కూడా ఓ ట్వీట్ వేశారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీ మృగరాజుకి 21 ఏళ్లు అనేది ఆ ట్వీట్ సారాంశం. ఆ సినిమాలో భాగమైనందుకు దర్శకుడు గుణశేఖర్ కు, హీరో చిరంజీవికి ఆమె మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ఆ సినిమాని చిరంజీవి కూడా అంతలా గుర్తుంచుకోని ఉండరు. అందులోనూ అది ఫ్లాప్ లిస్ట్ లో ఉంది. సో.. అభిమానులు కూడా మృగరాజు పేరు చెబితే డిస్కషన్ పెంచరు. కానీ సిమ్రన్ ఈ పోస్ట్ తో పాత గాయాన్ని రేపినట్టయింది.

 
హిట్ సినిమాల యానివర్సరీల గురించి చెబితే.. ఎవరికైనా ఆసక్తి ఉంటుంది, కానీ సిమ్రన్ హిట్ సిినిమాలతోపాటు, ఫ్లాప్ సినిమాల ప్రస్తావన కూడా తీసుకు రావడం విశేషం. చిరంజీవి మృగరాజు, బాలకృష్ణతో చేసిన సీమసింహం సినిమాల వార్షికోత్సవాలను కూడా ఆమె ప్రస్తావించారు. సీమసింహం సినిమాని కూడా ఆమె గుర్తుంచుకోవడం విశేషం. బాలయ్యతో చేసిన ఆ సినిమా సిమ్రన్ కి గొప్ప కావచ్చు కానీ, సీమసింహం బాక్సాఫీస్ రివ్యూ అభిమానులకు మాత్రం ఇష్టం ఉండదు. కానీ సీనియర్ హీరోల ఫ్లాప్ సినిమాల గురించి ట్వీట్లు వేస్తూ సిమ్రన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: