'నన్ను దోచుకుందువటే'తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ నాభా నటేష్. ఈసినిమా యావరేజ్ గా ఆడినా .. నాభా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం తరువాత ఆమెకు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ 'ఇస్మార్ట్ శంకర్' లో ఓ హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. ఇటీవల విడుదలైన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈచిత్రంలో గ్లామర్ పరంగా కూడా మెప్పించింది నాభా .
ఈ సినిమా తరువాత నాభా ప్రస్తుతం మాస్ రాజా రవితేజ సరసన 'డిస్కో రాజా' లో నటిస్తుంది. ఈ సినిమా లో ఆమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంటుందట. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే నాభా మరో రెండో ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా సుప్రీం హీరో సాయి తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తుంది . ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ కూడా ప్రారంభమైంది. నూతన దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రం తో పాటు తాజాగా యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి నటించడానికి ఓకే చెప్పింది నాభా నటేష్. ఈ చిత్రంకోసం ఆమె ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. మేకర్స్ కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నారని సమాచారం. రేపు ఈ చిత్రం లాంచ్ అవుతుంది. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.