హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు సొంత పార్టీతోనే తలనొప్పి ఉందా?

ఏపీలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. వైసీపీ రాకముందు వరకు ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉండేది. కాంగ్రెస్ కనుమరుగయ్యాక వైసీపీ డామినేషన్ పూర్తిగా కనిపిస్తోంది. ఆ విషయం 2014, 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అలా ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో పాడేరు కూడా ఒకటి.

ఇక్కడ 2014 , 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ జెండా ఎగిరింది. అయితే 2014 లో వైసీపీ తరుపున గెలిచిన గిడ్డి ఈశ్వరి తర్వాత టీడీపీలోకి వెళ్లిపోవడంతో, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వైసీపీ నుంచి పోటీ చేసి, టీడీపీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరిపై దాదాపు 40 వేలపైనే మెజారిటీతో గెలిచారు.

ఇక భారీ మెజారిటీతో గెలిచిన భాగ్యలక్ష్మి నియోజకవర్గంలో నిదానంగా పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో నియోజకవర్గం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ ఆసుపత్రిలు పెద్దగా అందుబాటులో లేకపోవడం వల్ల, ప్రజలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. అక్షరాస్యత తక్కువగా ఉండడం వల్ల, ఇక్కడి ప్రజలు అనాదిగా దోపిడీకి గురవుతున్నారు. ఇక్కడ ప్రాథమిక విద్యావకాశాలు కుడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో రవాణా సౌకర్యం కూడా లేదు.

ఇక రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి బాలరాజు డామినేషన్ బాగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన తన కుమార్తెకు సీటు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో భాగ్యలక్ష్మికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. అలాగే నియోజకవర్గంలో కొన్ని కొన్ని చిన్న గ్రూపులు కూడా ఉన్నాయి.

అయితే భాగ్యలక్మి ఏ గ్రూపుని కలుపుకుని వెళ్లలేకపోతున్నారు. ఇక్కడ టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. గిడ్డి ఈశ్వరి పార్టీ మారడం వల్ల, అక్కడి ప్రజలు ఆమెని నమ్మే పరిస్థితుల్లో లేరు. పైగా ఇక్కడ టీడీపీకి అంతబలం లేదు. ఈ పరిణామాల వల్ల పాడేరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వైసీపీనే దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆధిపత్య పోరు ఉన్నాసరే ఇక్కడ వైసీపీకి తిరుగులేదని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: