శభాష్: మన వైజాగ్ కుర్రాడు.. అమెజాన్లో అదరగొట్టేశాడు..!
సాధారణంగా అమెజాన్లో మోస్ట్ పాపులర్ పుస్తకంగా ఎంపిక కావాలంటే.. దేశవ్యాప్తంగా బాగా పేరున్న రచయితలకే సాధ్యం అవుతుంటుంది. ఈ ఏడాది అలా మోస్ట్ పాపులర్ బుక్గా మన వైజాగ్ కుర్రాడు రాసిన ఓ పుస్తకం ఎంపిక కావడం సంచలనం సృష్టించింది. అమెజాన్ ‘పాపులర్ బుక్ అఫ్ ది ఇయర్ 2021’గా విశాఖ కుర్రాడు శ్రీధర్ బెవర రాసిన పుస్తకం ఎంపికై సంచలనం సృష్టించింది. ‘ది రోరింగ్ లాంబ్స్’ పేరుతో శ్రీధర్ బెవర రాసిన ఈ పుస్తకం బిజినెస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో మోస్ట్ పాపులర్ బుక్ ఆఫ్ ద ఇయర్ 2021గా ఎంపికైంది.
అమెజాన్ సంస్థ ఆన్లైన్ ఓటింగ్ ద్వారా ఈ ఎంపిక చేస్తుంది. ఈ ఎంపిక కోసం డిసెంబరు 10 నుంచి అమెజాన్ సంస్థ ఓటింగ్ ప్రారంభించింది. డిసెంబర్ 28వ ఓటింగ్కు అవకాశం కల్పించింది. మొత్తం 9 విభాగాల్లో ఈ పోటీ నిర్వహించింది అమెజాన్ సంస్థ. తొమ్మిది విభాగాల్లో ఒక్కో విభాగానికి ఐదేసి చొప్పున పుస్తకాలను ఎంపిక చేసింది. వాటికి ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించింది. ఆ విభాగాలు ఏంటంటే.. భారతీయ భాష, పిల్లల విభాగం, రొమాన్స్, యంగ్ అడల్ట్, బయోగ్రఫీస్ అండ్ మెమోరీస్, బిజినెస్ అండ్ ఎకనామిక్స్, క్రైం త్రిల్లర్ అండ్ మిస్టరీ, సెల్ఫ్ హెల్ప్, లిటరేచర్ అండ్ ఫిక్షన్.. ఇలా 9 విభాగాల్లో పోటీ పెట్టింది.
అందులో బిజినెస్ అండ్ ఎకనామిక్స్ విభాగంలో మన శ్రీధర్ బెవర రాసిన ద రోరింగ్ లాంబ్స్ బెస్ట్ పాపులర్ బుక్గా ఎంపిక కావడం విశేషం. ఇక మిగిలిన విభాగాల్లో రవీందర్ సింగ్, ప్రితి షెనాయ్, చేతన్ భగత్, కబీర్ బేడి, బెంజిమెన్, సుదీప్ నగార్కర్, సవీ కర్నాల్, నవ్వీ రాసిన పుస్తకాలు మోస్ట్ పాపులర్ బుక్స్ గా ఎంపికయ్యాయి.