ఈ నాటి కుటుంబం: నాటి పిండి వంటలు వద్దు... నేటి జంక్ ఫుడ్సే ముద్దు
సాధారణంగా ఏదైనా పండగ వచ్చిందంటే చాలు.. పిండి వంటలతో ఇల్లు నిండిపోతుంది. ఇక సంక్రాంతి అయితే చెప్పాల్సిన పని లేదు. కనీసం పది రోజు ముందు నుండే పిండి వంటలు స్టాట్ చేసేవారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు.. వీటితో పాటు ప్రధానంగా ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండివంటలు. సంప్రదాయ పిండివంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. పూర్వీకులు నిర్ణయించిన సంప్రదాయక వంటలే అయినప్పటికీ వాటిలో పోషకాలు అత్యధికమని వైద్యనిపుణుల అభిప్రాయము.
ఇక ఈ పిండి వంటల్లో ముందు ఉండేవి అరెసలు. అసలు అరిసెలు లేని సంక్రాంతిని ఊహించుకోవడం కష్టం అంటే దాని ప్రాధాన్యత తెలుసుకోవచ్చు. బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి శ్రేష్ఠం కూడా. అలాగే పండుగకు ఇళ్లకు వచ్చే పిల్లలు, బంధువులు, మిత్రులందరికీ వండిన వంటలను పెడుతుంటారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఇరుగు పొరుగు ఆప్యాయతతో మెలిగే సమయంలో పిండి వంటలను ఇంటి మహిళలు ఇతరుల సాయంతో ఒకరికొకరు చేసుకొనేవారు. ఇలా గతంలో అరిసెలు, బూర్లు, పులిహోర, గారెలు, సున్ని వండలు, లడ్డూలు, బూందీ, జంతుకులు, గులాబీ గుత్తెలు ఇలా సంప్రదాయ వంటలు ఉండేవి.
కానీ.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఆ పరిస్థితులు లేవు. ఎవరికివారే యమునా తీరే అనే రీతిలో చేసుకోవాల్సి వస్తుంది. దీంతో ఇళ్లలో పిండి వంటలు తయారీ చాలా వరకు తగ్గిందనే చెప్పవచ్చు. ఇక ఇప్పుడు బిర్యానీలు, పిజ్జాలు ఈ మోడ్రన్ వంటకాలే తింటున్నారు. ఈ క్రమంలోనే ఏ ఏరియా చూసినా, ఏ గల్లీకి వెళ్లిన ఫాస్ట్ఫుడ్ సెంటర్లు తప్పక దర్శనమిస్తాయి. స్కూల్ పిల్లలు మొదలు వృద్దుల వరకు అందరూ ఈ జంక్ ఫుడ్కు అలవాటు పడిపోతున్నారు. దీంతో అనేక అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు.