నవంబర్ 6వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?
ప్రముఖుల జననాలు..
ముంతాజ్ అలీ (జననం:6 నవంబరు, 1948) కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో జన్మించిన ముంతాజ్ అలీ ఓ ఆధ్యాత్మిక వేత్త. జిడ్డు కృష్ణమూర్తిలా ఓ వేదాంతి. జిడ్డు కృష్ణమూర్తికి చెందిన రిషి వ్యాలీతో అభినాభావ సంబంధమున్న ముంతాజ్ అలీ, సత్సంగ్ ఫౌండేషన్ ను స్థాపించి శాంతి సౌభ్రాతృత్వం కొరకు పాటుపడుతున్న వ్యక్తి. జిడ్డు కృష్ణమూరి తత్వాన్ని, భారతీయ తాత్వికతను ఒంటబట్టించుకున్న ముంతాజ్ అలీ మిస్టర్ ఎం గానూ చిరపరిచితుడు. పరమత సహనం, శాంతి కొరకు యావత్ భారతదేశం పర్యటించి, శాంతి, తత్వముల సారాన్ని ప్రజలకు వివరిస్తూ అనేక యాత్రలను కార్యక్రమాలను చేపట్టాడు.ఇతని జీవితంపై దర్శకుడు రాజా చౌదరి 2011 లో The Modern Mystic: Sri M of Madnapalle" అనే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించాడు. మదనపల్లె సమీపంలో సత్సంగ్ కుటీరంలో తన నివాసం.
'డాıı పాపినేని శివశంకర్' సుప్రసిద్ధ కవి, కథకులు, విమర్శకులు. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధి గాంచారు. 1953 నవంబర్ 6న విజయ దీపావళి నాడు గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించిన శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన రాసిన రజనీగంధ అనే కవితా సంపుటికి గాను కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబరు 21 న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం.
ప్రముఖుల మరణాలు...
సంజీవ్ కుమార్ (జన్మ నామం: హరిహర్ జెఠాలాల్ జరీవాలా 9 జూలై 1938 – 6 నవంబర్ 1985) ఒక పేరుపొందిన భారతీయ చలనచిత్ర నటుడు. ఇతడు అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలోఉత్తమ నటుడిగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉన్నాయి. ఇతడు సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.
కపిలవాయి లింగమూర్తి (మార్చి 31, 1928-నవంబర్ 6, 2018) పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు. పద్య రచనతో ఆయన ప్రస్థానం ఆరంభమైనా కథా రచన, విమర్శ ప్రక్రియతో వెలుగులోకి వచ్చాడు. జానపద సాహిత్యం, పాలమూరు జిల్లా లోని దేవాలయాలపై విస్తృత పరిశోధనలు చేశాడు. 70 కి పైగా పుస్తకాలు రచించాడు. ఈయనకు కవి కేసరి అనే బిరుదు ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేటు అందుకున్న తొలివ్యక్తి కపిలవాయి లింగమూర్తి.