చరిత్రలో ఈరోజు : 26-07-2020 రోజున ఏం జరిగిందంటే..?
జూలై 26వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల మరణాలు ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి.
ప్రగడ కోటయ్య జననం : ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు చేనేత పరిశ్రమ రక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు ప్రగడ కోటయ్య 1915 లో 26వ తేదీన జన్మించారు. 1937 లో గుంటూరులో జరిగిన చేనేత మహాసభలను వెనకుండి నడిపించింది ఈయనే . చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నో సూచనలు సలహాలు ఇవ్వడంతోపాటు ఎంతగానో పోరాటం చేశారు. కార్మికులందరికీ చాలి నంత నూలు సరఫరా చేయాలని నూలు ధరలు అదుపులో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గులాబ్ రాయి రామ్ చంద్ జననం : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అయినా గులాబ్ రాయి రామ్ చంద్ 1927 జులై 26వ తేదీన జన్మించారు. భారత క్రికెట్ జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించారు ఈయన. ఆస్ట్రేలియాలో ఆడిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఈయన భారత జట్టుకు విజయాన్ని అందించారు. ఈయన టీమిండియాకు సారథిగా వ్యవహరించిన మ్యాచ్ లలో విజయం సాధించిన ఓకే ఒక సిరీస్ ఇదే కావటం గమనార్హం.
కోనేరు రంగారావు జననం : రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మాజీ మంత్రి అయిన కోనేరు రంగారావు 1935 జూలై 26వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా కోనేరు రంగారావు విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేసారు ఈయన.
అభిరామి జననం : భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి నేపథ్యగాయని అయిన అభిరామి 1983 జూలై 26 వ తేదీన జన్మించారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించారు అభిరామీ . అంతేకాకుండా నేపథ్యగాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు.
గోపారాజు రామచంద్ర రావు మరణం : ప్రముఖ సంఘ సంస్కర్త హేతువాది భారతీయ నాస్తికవాద నేత అయినా గోపరాజు రామచంద్రరావు 1975 జూలై 26 వ తేదీన పరమపదించారు. పెళ్లికి ముందే శృంగారంపై అవగాహన లు.. కుటుంబ నియంత్రణ సహా మరికొన్ని విషయాలపై అప్పటి సమాజంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు గోపరాజు రామచంద్రరావు.
కొండపల్లి శేషగిరిరావు మరణం : తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ చిత్రకారుడు భారతీయ సాంప్రదాయ చిత్రలేఖనంలో అద్భుతాలు సాధించిన వ్యక్తి అయినా కొండపల్లి శేషగిరిరావు 2012 జూలై 26 వ తేదీన మరణించాడు. ఈయన చిత్రలేఖన ప్రస్థానం ఎంతో అద్భుతంగా సాగింది అని చెప్పాలి. భారతీయ పురాణాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రలేఖనం ద్వారా వ్యక్తపరిచి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఈయన చిత్రాలను దేశ పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియంలో సైతం ప్రదర్శించారు.