దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ.. భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం విధితమే. తాజాగా తెలంగాణలో ఒమిక్రాన్ రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరుకున్నది. ఈ సందర్భంలో కోఠి వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియాతో తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు మాట్లాడారు. ముఖ్యంగా శంషాబాద్ రాజీవ్గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ ఫోర్ట్లో సేకరించిన నమూనాలలో 9 మందికి ఒమిక్రాన్ నిర్థారణ అయింది అని.. వీరిలో 8 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారని, మరొకరు పశ్చిమబెంగాల్కు వెళ్లారని వెల్లడించారు.
ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని, శ్రీనివాసరావు స్పష్టం చేసారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురితో పాటు హన్మకొండకు చెందిన మహిళకు కూడా ఓమిక్రాన్ సోకినట్టు చెప్పారు. చెక్రిపబ్లిక్, సూడాన్, యూకే, కెన్యా, సోమాలియా వంటి దేశాల నుంచి వారికి ఒమిక్రాన్ సోకిందని వివరించారు. హన్మకొండకు చెందిన మహిళకు 8 రోజుల తరువాత కొవిడ్ పాజిటివ్.. ఆ తరువాత ఒమిక్రాన్ నిర్థారణ అయిందని తెలిపారు. హన్మకొండలో తొలి ఒమిక్రాన్ కేసు అని, యూకే నుంచి వచ్చిన సుబేదారి ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు.
ముఖ్యంగా 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందిందని, ఇప్పటివరకు యూకేలో ఒకటి తప్ప ఎక్కడా మరణాలు నమోదు కాలేదని.. 95 శాతం కంటే ఎక్కువగా ఒమిక్రాన్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉండడం లేదని చెప్పారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదాలు లేదని, మూడవ దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసారు. ఒమిక్రాన్ పట్ల అసలు భయాందోళన అవసరం లేదని, వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణం అవుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలుచేయించుకోవాలని.. ఇంట్లో, బయట ఎక్కడైనా సరే మాస్కులు మాత్రం తప్పకుండా ధరించాలని.. కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని డీహెచ్ సూచించారు.