ఫీజు డబ్బులు ఇస్తాం.. చదువుకుంటారా..!
ఇందుకోసం కేంద్రం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. చదువుకుంటే రూ. 2వేల రూపాయలు సాయం చేయబోతోంది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. 16-19 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దూరవిద్య విధానంలో పది, ఇంటర్ చదవాలనుకునే వారికే ఈ అవకాశం. వీరికి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఏడాదికి రూ.2 వేల మేర ప్రోత్సాహం అందిస్తారు. ఈ రూ.2 వేల సాయాన్ని తొలిసారిగా ఈ విద్యా సంవత్సరంలోనే అమలు చేస్తారు.
మరో కండిషన్ ఏంటంటే.. ఈ మొత్తాన్ని ప్రవేశ రుసుం, పరీక్ష ఫీజు, కోర్సు మెటీరియల్ కోసమే ఖర్చు చేయాలి. అయితే.. ఈ రూ.2 వేలు ఎలా ఇవ్వాలన్న దానిపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. అభ్యర్థుల చేతికి ఇస్తే వాటిని ప్రవేశం పొందకుండానే ఇతర ఖర్చులకు వాడుకుంటారు. అందుకే ఈ సొమ్ము సార్వత్రిక విద్యాపీఠానికి ఇవ్వాలని ఓ ఆలోచన కూడా ఉంది. లేదా.. డీఈఓలకు ఇవ్వాలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డీఈఓల ఆమోదం ద్వారా జాతీయ సార్వత్రిక విద్యాపీఠం.. ఎన్ఐఓఎస్ కానీ.. రాష్ట్రాల సార్వత్రిక విద్యాపీఠంలో చేరేవాళ్లకు ఈ ఆర్థిక సాయం వర్తింపజేయొచ్చు.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠంలో ఈ విద్యా సంవత్సరానికి పది, ఇంటర్ ప్రవేశాలు ఈ వారంలో ప్రారంభం అవుతాయి. ఈ కొత్త ఆర్థిక సాయంపై రూల్స్ వస్తే.. వేల మంది ప్రయోజనం పొందుతారు. ప్రస్తుతం సార్వత్రిక విద్యాపీఠంలో ఓసీ విద్యార్థి పదో తరగతి చదవాలంటే రూ.1600 వరకు ఖర్చవుతోంది. ఇంటర్ విద్యకు ఏడాదికి రూ.1850 ఖర్చవుతోంది. కేంద్రం రూ.2 వేల సాయం అందిస్తే ఈ ఫీజుల భారం విద్యార్థులకు తగ్గుతుంది.