
ఎస్ఎల్బీసీ సొరంగం ఘటనలో ప్రభుత్వం సంచలనం..! వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనా..?
ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిలో గుర్ ప్రీత్ సింగ్ మృతదేహం మార్చి 9వ తేదీన లభ్యమైంది. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగిస్తోంది ప్రభుత్వం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్ లో కీలక పురోగతి సాధించారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మరో మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది మిగితా ఆరుగురి జాడ కోసం 32వ రోజు కూడా అవిశ్రాంతంగా రెస్క్యూ టీం కృషి చేస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మట్టి నీరు, టీబీఎం శకలాల తొలగింపు పనుల్లో రెస్క్యూ ఆపరేషన్స్ పర్యవేక్షణ కోసం ఐఏఎస్ శివశంకర్ ను ప్రత్యేకాధికారిగా నియమించింది ప్రభుత్వం. ఈ క్రమంలో ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చే విషయంలో రేవంత్ రెడ్డి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన సహాయక చర్యలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్ ను ఆదేశించారు.
నెల రోజులుగా ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని విపత్తు నిర్వహణ విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా ముఖ్యమంత్రికి వివరించారు. కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలతో పాటు ప్రైవేటు సంస్థలన్నీ కలిపి 25 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. మొత్తం 700 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ లో నిమగ్నమైనట్లు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కళ్లకు కట్టించేలా ప్రమాదం జరిగిన రోజున, ఇప్పుడున్న పరిస్థితుల ఫొటోలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు. ఇన్లెట్ వైపు నుంచి సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినందున గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా సాగుతోందని అధికారులు వివరించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్ గా గుర్తించినట్లు చెప్పారు. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.