అప్పటి పాపాలకు జగన్.. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారా?

ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయ ఘర్షణలు కలకలం రేపాయి. కొన్ని చోట్ల జరిగిన ఈ హత్యలను ప్రధానం చేస్తూ అటు అధికారాన్ని, ఇటు ప్రతిపక్ష హోదాని కోల్పోయిన వైసీపీ ధర్నాలు చేయడం కూడా చేసింది. అన్ని పార్టీలకు లేఖలు రాసి మద్దతు ఇవ్వాలని ఏకంగా దిల్లీలో ధర్నా చేసింది. ఇక ఇండియా కూటమి నేతలు కూడా జగన్ దీక్షకు సంఘీభావం తెలిపారు.

అయినా రాజకీయ ప్రేపిత దాడులు ఆగడం లేదని.. వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగుతూనే ఉన్నాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ఈ దాడులను అడ్డు కట్ట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదని.. అందుకే ఈ దాడులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. దాడులను అడ్డుకోవడానికి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించిన ఆయన.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ ఇష్టానుసారంగా ఘర్షణలకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ దాడులతో ఏం సాధిస్తారో అర్థం కావడం లేదని.. కానీ ఇలాంటి వాటితో మాత్రం ప్రజలు భయపడరన్నారు. చంద్రబాబు పాలనపై కాకుండా తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడుల కోసం ఫోకస్ పెడుతున్నారని మండి పడ్డారు.

ఇదంతా చంద్రబాబుపై ద్వేషం పెంచుతోందని.. చాలా వేగంగా ఆయన గ్రాఫ్ పడిపోతుందని తెలిపారు. తప్పుడు సంప్రదాయాలను ఆపాలని.. లేకపోతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే టీడీపీ వారిని ట్రీట్ చేసేలా ఇప్పటి నుంచే బీజాలు వేస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు.
హత్య చేయించింది ఎవరు. చేసింది ఎవరు ఆ ఎమ్మెల్యేల పేర్లు, ప్రజాప్రతినిధుల పేర్లు ఎందుకు చేర్చడం లేదు. ఎప్పుడైతే వారి పేర్లు కూడా చేర్చుతామో అప్పుడే ఈ దాడులు ఆగుతాయి అని వివరించారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియమాలు ఎక్కడికి వెళ్లాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడులు.. ఇంకా ఇలాంటి ఘటనలు చాలా జరిగినప్పుడు ఎంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారో చెప్పాలని అడుగుతున్నారు. మొత్తం మీద జగన్ నాడు చేసిన తప్పుల మూలంగానే నేడు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: