జగన్‌ అందర్నీ చెడగొట్టేశాడట.. పాపం బాబుకు ఆప్షన్లు లేవట..?

ఐఏఎస్‌, ఐపీఎస్‌లు.. వీళ్లే ప్రభుత్వాలకు కళ్లు, ముక్కు, చెవులు. పేరుకు సీఎందే అధికారం అయినా ప్రభుత్వాన్ని నడిపించేది ఈ ఐఏఎస్‌, ఐపీఎస్‌లే. అయితే గతంలో ఈ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కాస్త స్వతంత్ర్యంగా వ్యవహరించేవారు. పాలకులకు తగిన సూచనలు ఇస్తూ మంచి పాలన జరిగేలా తోడ్పడేవారు. కానీ.. ఇటీవల ఈ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు కూడా తమ ప్రమోషన్లు, పోస్టుల కోసం పాలకుల ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. ముఖ్యమంత్రులకు అనుకూలంగా పని చేయడానికి అలవాటు పడ్డారన్న విమర్శలు ఉన్నాయి.

అయితే జగన్ హయాంలో ఈ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు పరిస్థితి దారుణంగా ఉండేదట. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అయివుండి కూడా వారు చాలా దిగజారి పోయారట. జగన్‌ పాలనలో ఒక రకమైన భయానక వాతావరణం ఉండేదట. మనసులో మాట చెప్పుకోవడానికి కూడా ఈ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు సాహసించలేకపోయారట. భయం గుప్పిట్లో మనసు చంపుకొని పనిచేశారట. ఇదంతా ఓ ఐఏఎస్‌ అధికారి ఓ పత్రికాధిపతికి చెప్పుకున్న బాధ. దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆయన కోటరీలో ఉన్న వారి విపరీత మనస్తత్వాల వల్ల అధికార యంత్రాంగం కుళ్లిపోయిందంటున్నారు సదరు పత్రికాధిపతి.

జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని నమ్మి ఈ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అడ్డగోలు పనులు చేశారట. జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు అదంతా ఎందుకు అంటారా.. ఇప్పుడు ఈ కుళ్లిపోయిన అధికార యంత్రాంగంతోనే పాపం చంద్రబాబు పని చేయించుకోవల్సివస్తోందట. ఏ అధికారి ఎంతగా చెడిపోయాడో అంటూ తెగ ఫీలైపోతున్నారా పత్రికాధిపతి. చంద్రబాబు ఇటీవల అధికారుల ఎంపికలో కొన్ని తప్పులు జరిగాయని... అయితే చంద్రబాబుకు ఆప్షన్లు తక్కువగా ఉన్నాయని ఆ పత్రికాధిపతి అంటున్నారు.

గతంలో సమర్థులుగా పేరు తెచ్చుకున్న అధికారులను కూడా ఈ ఐదేళ్లలో జగన్ చెడగొట్టేశారట. పాపం చంద్రబాబుకు వేరే ఆప్షన్లు లేక కొందరికి మంచి పోస్లులు ఇవ్వాల్సి వచ్చిందట. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఎంపికలపై తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: