ఆ సీనియర్లను అద్భుతంగా హ్యాండిల్‌ చేసిన చంద్రబాబు?

ఏపీ మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి మహామహులైన సీనియర్లకు చంద్రబాబు క్యాబినెట్ లో చోటు దక్కలేదు. మూడు నెలల క్రితం పార్టీలోకి వచ్చిన వారికి సైతం మంత్రి వర్గంలో స్థానం లభించింది. కానీ నాలుగు దశాబ్ధాలుగా పార్టీకి వెన్నెముకగా నిలిచిన వారికి మాత్రం మంత్రి వర్గంలో  నిరాశే ఎదురైంది. దీనిపై ఏపీలో గట్టిగానే చర్చ జరుగుతుంది.

అయితే చంద్రబాబు ఫ్యూచర్ స్టెప్ లో భాగంగానే ఈ మంత్రి పదవుల పంపకం జరిగింది అని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీకి గట్టి భవిష్యత్తు కోసం చంద్రబాబు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొన్నారని పేర్కొంటున్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, నిమ్మకాయల చిన రాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బండారు సత్యనారాయణ మూర్తి, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర.. ఇవన్నీ పార్టీలో పెద్ద తలకాయలు.

కానీ మంత్రి వర్గంలో వీరికి చోటు దక్కలేదు. పార్టీ అనుమతి లేకుండా కొన్ని పొరపాట్లు చేసిన గంటా.. మినహా వారంతా టీడీపీనే శ్వాసగా బతికిన వారు. అయితే ఏపీలో కొలువుదీరిన మంత్రుల్లో 17మంది కొత్తవాళ్లు కాగా.. ఎనిమిది మంది అసెంబ్లీ గేటు తాకడం ఇదే తొలిసారి. అయితే తమకు మంత్రి పదవులు దక్కకపోవడంతో వారంతా అసంతృప్తి వెళ్లగక్కుతారని అంతా భావించారు. కానీ చాలా బాధ్యతాయుతంగా అందరూ సమాధానం ఇచ్చారు.

యనమల మాట్లాడుతూ.. మేం క్యాబినెట్ హోదా తీసుకున్న సమయంలో నా వయసు 29 ఏళ్లు అని.. ఇప్పుడు కూడా జూనియర్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. సీనియర్లు పార్టీకి ఉపయోగపడాలి. యువతకు అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇదే విషయమై అయ్యన్నపాత్రుడు కూడా విభిన్నంగా స్పందించారు. నా వరకు అయితే పాతికేళ్లకే మంత్రి అయ్యాను అని.. నాడు సీనియర్లు అలిగారా అని ఎదురు ప్రశ్నించారు. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. మంత్రి అవ్వాలనే ఆలోచన నాకు ఉంది. కానీ పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి. యువతకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. వీరితో పాటు చాలా మంది సీనియర్లు బాధ్యతాయుతంగా స్పందించడంతో వీరిని పలువరు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: