మరో ఉచిత పథకాన్ని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి?
ఈ పథకం ఎలా అమలు చేయాలనే అంశంపై ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు విధివిధానాల రూపకల్పనలో తలమునకలయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరడం, ప్రీమియం చెల్లింపులు, బీమా పరిహారం వంటి అంశాలతోపాటు పోరుగు రాష్ట్రాల్లో పంట బీమా పథకం ఎలా అమలవుతుందని ప్రభుత్వం అధ్యయం చేస్తోంది. గతంలో అమలు చేసిన బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95 శాతం ప్రీమియం, మిగిలిన 5 శాతం రైతులు చెల్లించారు. సరైన రీతిలో పంట నష్టపరిహారం పొందడటంతో అనేక సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. పెద్దగా రైతులకు ఉపయోగకరంగా లేదు. బీమా కంపెనీలకు లబ్ధిచేకూర్చేలా ఉండటంతో పీఎంఎఫ్బీవై పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది.
కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు తిరిగి పంటల బీమా పథకం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రైతుల తరపున ప్రీమియం మొత్తం చెల్లించాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ఈ వానా కాలం నుంచి పంటల బీమా పథకం ప్రారంభించాలని యోచిస్తున్న దృష్ట్యా ఎన్నికల కోడ్ ముగియగానే సంబంధిత నిధులు విడుదలకు రేవంత్ రెడ్డి సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా... బీమా పథకం పట్టాలెక్కించాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది.