కన్నీటి ఆంధ్రప్రదేశ్‌: అభివృద్ధి తీరం చేరేదెప్పుడో?

ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నీ నదులు, సముద్రాల తీరాల్లోనే ఉన్నాయి. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ప్రత్యేకించి సముద్ర తీర ప్రాంతం సహజాభివృద్ధి కేంద్రంగా చెప్పుకోవచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో వాణిజ్య అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అందువల్లే చరిత్రలో కోల్‌కతా, మచిలీపట్నం, విశాఖ, చెన్నై, త్రివేండ్రం, ముంబై వంటి నగరాలు వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే ఇలాంటి తీర ప్రాంతం ద్వారా ఉన్న అవకాశాలను ఆంధ్రప్రదేశ్‌ సరిగ్గా వినియోగించుకోలేకపోతోంది.

ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రత్యేక అంశాల్లో సుదీర్ఘమైన తీర ప్రాంతం ఒక అంశం. దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌ తర్వాత స్థానం మన ఆంధ్రప్రదేశ్‌దే. అయినా సరే.. గుజరాత్‌ తరహాలో తీర ప్రాంతాభివృద్ధి ఏపీలో జరగనేలేదు. ఏపీలో ఒక్క విశాఖ తప్ప తీర ప్రాంత అవకాశాలను అందిపుచ్చుకున్న మరో ప్రాంతం ఏపీలో కనిపించదు. ఇందుకు పాలకుల చిన్నచూపే కారణం.

ఐటీ రాజ‌ధాని ఒక‌రు.. అస‌లు పూర్తిస్థాయి రాజ‌ధాని అని మ‌రొక‌రు చెబుతున్న విశాఖ‌లో తీర ప్రాంతం ఎక్కువ‌గా ఉంది. కేంద్రప్రభుత్వ సంస్థలు.. ఎక్కువ‌గా ఉన్నాయి. తీర ప్రాంతాన్ని అభివృద్ది చేసేందుకు కేంద్రం కూడా నిధులు ఇస్తోంది. కానీ.. వీటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. జగన్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక.. రాజధాని సమస్యను తీర ప్రాంత అభివృద్ధితో ముడిపెట్టి విశాఖను రాజధానిని చేయడం ద్వారా కొంత అభివృద్ధి సాధించాలని భావించారు. అయితే అది ఆయన పాలనాకాలంలో పూర్తిగా సాకారం కాలేదు. అలాగే.. జగన్ సర్కారు వచ్చాక కొత్తగా పోర్టుల అభివృద్ధిపైనా దృష్టి సారించినా.. చాలా వరకూ నిర్మాణ దశలోనే ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న పోర్టులన్నీ పూర్తయితే ఏపీకి మంచి వాణిజ్య ఆదాయం తెచ్చే అవకాశం ఉంది.

తీర ప్రాంతం అంటే ఒక్క వాణిజ్యమే కాదు. పర్యాటకపరంగా కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఆ పరంగా ఏపీ అందిపుచ్చుకున్న అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. గోవా వంటి రాష్ట్రాలు కేవలం పర్యాటకంపైనే ఆధారపడి మనుగడ సాధిస్తున్నాయి. ఏపీలో ఉన్న చక్కటి బీచ్‌లను గుర్తించి అభివృద్ధి చేసి.. రవాణా, వసతి సౌకర్యాలు కల్పిస్తే మంచి ఆదాయం తెచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి జరగడం లేదన్నదే సగటు ఆంధ్రుడి ఆవేదన. మరి ఆ ఆవేదన తీరేదెన్నడో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: