మోడీ లెక్క తప్పుతోంది.. ఫ్రస్టేషన్‌ పెరుగుతోంది.. అందుకే రామాలయంపై అంత మాట అనేశారా?

అగ్గిపిల్ల, సబ్బుబిళ్ల, కుక్కపిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు బీజేపీ నాయకులు దీనికి కాస్తా మార్పులు చేర్పులు చేసి పేరు ఏదైనా మతం రంగు పులమడానికి అడ్డేముంది అని వితండ వాదం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు  మతం రంగు పులుముకుంటున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించినా.. అప్పుడు అభివృద్ధి, లబ్ధిదారులు, జాతీయ భద్రత వంటి అంశాలతో మతతత్వాన్ని ముందుకు తీసుకువచ్చింది.

ఇప్పుడు దేశంలో అయిదో ఫేజ్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే మూడో సారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న మోదీ ఈ ఎన్నికల్లో ఒక అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలకే పరిమితం అవుతున్నారు. ఒక ప్రధాని మాట్లాడాల్సిన భాషను మోదీ ఉపయోగించడం లేదనేది ప్రతిపక్షాల తీవ్ర ఆరోపణ. దీనిపై ఈసీ సైతం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేక పార్టీలు అనే ముద్ర వేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్నికల ఫేజ్ లు నడుస్తున్న కొద్దీ విద్వేషం మరింత ఎక్కువ అవుతుంది. గతంలో హిందువుల మంగళ సూత్రాలు తెంచి ముస్లింలకు అప్ప జెబుతారు అని తీవ్ర విమర్శలు చేసిన.. మోదీ.  ఆతర్వాత మత ప్రాతిపదికన రాజకీయాలు చేస్తే నేను అనర్హుడిని అంటూ ప్రగల్భాలు పలికిన  మోదీ.. మళ్లీ మత పరమైన అంశాలనే రెచ్చగొడుతూ లబ్ధి పొందాలని చూస్తున్నారు.

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీ కీలకం. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొన్న మోదీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామాలయంపై బుల్డోజర్లు పంపిస్తారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మత పరమైన అంశాలు లేవనెత్తకుండా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తుంటే.. వారిని రెచ్చగొడుతూ ఎవరికీ రాని ఆలోచనలు మోదీ ప్రజల ముందు ఉంచుతున్నారు. ఈ ఆలోచనే అపవిత్రం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి అయినా రామ మందిరం, హిందూ ముస్లిం వంటి అంశాలు కాకుండా పదేళ్లలో చేసిన అభివృద్ధి తదితర వాటి గురించి మాట్లాడి ఓట్లు అడగాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: