రష్యా చమురు: పోటీపడి కొంటున్న ఇండియా, చైనా?

ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఇండియా, చైనా వంటి దేశాలకు బాగా కలసి వచ్చినట్టు కనిపిస్తోంది. రష్యా నుంచి అతి చౌకగా లభిస్తున్న క్రూడాయిల్‌ను భారత్‌, చైనా పోటీపడి కొంటున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌, చైనా ముందు వరుసలో ఉంటాయి. రష్యా నుంచి చౌకగా లభిస్తున్న క్రూడాయిల్‌ కొనుగోలుకు చేసేందుకు ఇండియా, చైనా పోటీ పడుతున్నాయి. ఒక్క మే నెలలోనే రష్యా ఎగుమతి చేసిన ముడిచమురులో 80 శాతం ఈ రెండు దేశాలే దిగుమతి చేసుకున్నట్లు ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ తాజాగా వెల్లడించింది.


ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధానికి ముందు రష్యా చమురు ఎగుమతులు ఎక్కువగా  యూరోపియన్‌ దేశాలకే వెళ్తుండేవి. అంతే కానీ.. ఆసియా దేశాలకు మాత్రం చాలా తక్కువగా అంటే.. కేవలం 34 శాతం మాత్రమే ఎగుమతి అయ్యేది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత సీన్ మారిపోయింది. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు రష్యా చమురు ఎగుమతుల్లో నూటికి 90 శాతం ఆసియా దేశాలకే ఎగుమతి చేస్తోంది. ఇండియా, చైనాతో పాటు ఆసియాలోని మరికొన్ని దేశాలు సైతం ఈ చౌక చమురు కొనుగోలు చేస్తున్నాయి.


ఇక ఇండియా, చైనా విషయానికి వస్తే..  మే నెలలో రష్యా మొత్తం చమురు ఎగుమతుల్లో 80 శాతం ఈ రెండు దేశాలకే చేరిందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ లెక్కలు చెబుతున్నాయి. రష్యా చమురు ఎగుమతుల్లో ఆసియా దేశాల వాటా 34 శాతం నుంచి ఏకంగా 90 శాతానికి ఎగబాకిందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే నెలలో భారత్‌ చమురు అవసరాల్లో ఏకంగా  45 శాతం మేర రష్యా నుంచి వచ్చిన చమురే తీర్చడం విశేషం.


మే నెలలో రష్యా రోజుకు సగటున 3.87 మిలియన్‌ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ చెబుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమయ్యాక ఇదే అత్యధికంగా ఉంది. ప్రస్తుతం భారత్‌ రోజుకు సగటున 2 మిలియన్‌ బ్యారెళ్లను రష్యా నుంచి దిగుమతి చేసుకుందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: