జగన్‌ నాలుగేళ్ల పాలనలో ఉద్యోగులు హ్యాపీనా?

ప్రభుత్వానికి పాలకుడు ముఖ్యమంత్రే కావచ్చు. కానీ సీఎం నిర్ణయాలను అమలు చేయాల్సింది.. ప్రభుత్వానికి కళ్లు, ముక్కు, చెవులుగా పని చేసేది ఉద్యోగులే. మరి అలాంటి ఉద్యోగులు జగన్ నాలుగేళ్ల పాలనలో ఎలా ఉన్నారు. వారు సంతోషంగా ఉన్నారా.. జగన్ పాలనపై వారు ఏమంటున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో చంద్రబాబు హయాంలో ఉద్యోగులు చాలా అసంతృప్తిగా ఉండేవారు. మరి ఇప్పుడు జగన్ పాలనలో వారు ఏమంటున్నారన్నది ఇంట్రస్టింగ్.

అయితే తాజాగా సీఎం జగన్‌ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ నిర్ణయాలు ఉద్యోగుల్లో అసంతృప్తిని కాస్త తగ్గించాయనే చెప్పాలి. ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని.. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని తరచూ సీఎం జగన్ అంటుంచారు. తాజాగా తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఉద్యోగ సంఘాల నేత‌లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వకంగా క‌లిసిన సమయంలోనూ జగన్ ఇదే చెప్పారు.

అయితే.. కొత్తగా జీపీఎస్‌ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు వంటి రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు ఉద్యోగుల్లో సంతోషం నింపాయి. తాజాగా తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తంచేస్తూ ఉద్యోగ సంఘాల నేత‌లు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.

ఉద్యోగుల‌ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ‌మ‌న్న జగన్..  పెన్షన్‌తో స‌హా కొన్ని పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపనపడ్డామ‌ని ఉద్యోగ నేతలకు వివ‌రించారు. గతంలో ఎవ్వరూ కూడా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపనపడిన సంద‌ర్భాలు లేవ‌ని సీఎం జగన్ అన్నారు. అదే సమయంలో భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని అందుకే జీపీఎస్‌ను తీసుకువచ్చామ‌ని జగన్ అన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా జీపీఎస్‌ తెచ్చామన్నారు. 62 ఏళ్లకు రిటైర్‌ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాల‌ని జగన్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: