కాంగ్రెస్‌ వ్యూహకర్త.. చిక్కుకుపోయారా?

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఇప్పుడు పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆయనకు సీఆర్పీఎస్‌ 41 ఎ నోటీసు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులో స్పష్టం చేశారు. తుకారాంగేట్‌కు చెందిన ఆర్‌. సామ్రాట్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గత నెల 24వ తేదీన జూబ్లిహిల్స్‌లో సునీల్‌ కనుగోలు నిర్వహిస్తున్న కార్యాలయంపై దాడులు నిర్వహించిన సందర్భంగా అక్కడ ఉన్న కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.


అయితే.. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన నిర్వహించడతోపాటు తమ పార్టీ వార్‌ రూమ్‌పై దాడి ఏలా చేస్తారని నిలదీశారు. అప్పటికే సీజ్‌ చేసిన ఆ కార్యాలయ తాళాలు తిరిగి ఇవ్వడంతోపాటు ఆ ముగ్గురు ఉద్యోగులకు సీఆర్పీసీ 41 ఎ కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. తాజాగా సైబర్‌ క్రైం పోలీసులు సునీల్‌ కనుగోలుకు నోటీసులు రెడీ చేశారు. సునీల్‌ కనుగోలు అందుబాటులో లేకపోవడంతో పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి నోటీసు తీసుకున్నారు.


మొత్తం పది ప్రశ్నలతో కూడిన నోటీసుకు వివరణ తీసుకుని 30వ తేదీన ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో హాజరు కావాలని సైబర్‌ పోలీసులు సునీల్‌ కనుగోలుకు నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే ఒకవేళ హాజరు కానట్లయితే సీఆర్పీఎస్‌ 41 ఎ కింద అరెస్టు చేయడం జరుగుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు.  


ఈ నోటీసులను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ఈడీ తమను వేధిస్తోందని పదే పదే గొంతెత్తి అరిచే బీఆర్ఎస్‌ ప్రభుత్వ పెద్దలు తెలంగాణలో చేస్తున్నదేంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సైబర్ క్రైమ్‌ పోలీసులను ప్రయోగించి సునీల్ కనుగోలును బెదిరించేందుకు తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: