ఛీ..ఛీ.. దేవుడా.. చిన్నారులపై ఇన్ని అకృత్యాలా?

చిన్నారులపై లైంగిక హింస, అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న అంశాలు సమాజాన్ని  నివ్వెర పరుస్తున్నాయి. సమాజంలో మరీ ఇంత దారుణమైన మనుషులు ఉన్నారా.. పసి పిల్లలపై ఇంత దారుణాలు చేస్తున్నారా అని ఆశ్చర్యపోయే వాస్తవాలు సీబీఐ దాడుల్లో వెలుగు చూస్తున్నాయి. చిన్నారులపై లైంగిక హింస, అశ్లీల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ముఠాలపై తాజాగా  సిబిఐ కొరడా ఝుళిపించింది. ఆపరేషన్ 'మేఘచక్ర' పేరుతో.. ఏపీ, తెలంగాణ సహా... 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 59 ప్రదేశాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది.

అదుపులోకి తీసుకున్న అనుమానితుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా... కొన్ని రహస్య ప్రదేశాల నుంచి కూడా ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీ వెల్లడించింది. గత ఏడాది కూడా సీబీఐ 'ఆపరేషన్‌ కార్బన్' పేరుతో దర్యాప్తు చేసింది. ఆ సమాచారాన్ని ఇంటెలిజెన్స్ డేటా ఆధారంగా తాజాగా సోదాలు జరిగాయని సిబిఐ వెల్లడించింది. నిందితులు సమాచార ప్రసారానికి  ఉపయోగించే క్లౌడ్ స్టోరేజ్ లక్ష్యంగా 'ఆపరేషన్ కార్బన్' జరిగింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు  ఇంటర్‌పోల్‌ తాజాగా ఇచ్చిన సమాచారం ఆధారంగా తాజాగా 'ఆపరేషన్‌ మేఘచక్ర' చేపట్టింది.

ఇదంతా ఇంటర్‌ పోల్‌ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలు చేపట్టింది.. మొత్తం ఇప్పిటి వరకూ 50 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది.  న్యూజిలాండ్ పోలీసుల నుంచి సింగపూర్‌లోని ఇంటర్‌పోల్ యూనిట్ చిన్నారులపై నేరాలకు సంబంధించిన విషయంపై ఇచ్చిన సమాచారం ఆధారంగా ఐటి చట్టం ప్రకారం రెండు కేసులు నమోదు చేసింది. దర్యాప్తు ప్రారంభించినట్లు దర్యాప్తు సంస్థ అధికారికంగా ప్రకటించింది.

పిల్లలపై లైంగిక హింసకు సంబంధించిన సమాచార వ్యాప్తికి పాల్పడే ముఠాలను.. మైనర్లను బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకే ఈ దాడులు చేపట్టినట్లు సిబిఐ తెలిపింది. ఈ దాడుల్లో... మొబైల్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.  సైబర్ ఫోరెన్సిక్ సాధనాలను ఉపయోగించి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల ప్రాథమిక పరిశీలనలో చిన్నారులపై లైంగిక దాడుల వివరాలు ఉన్నట్లు వెల్లడైందని సిబిఐ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: