జగన్ డైలాగ్ వాడేస్తున్న తెలంగాణ లీడర్?
తెలంగాణ రాష్ట్రంలో పోడు వ్యవసాయం మీద ఆధారపడి చాలా మంది రైతులు జీవనం కొనసాగిస్తున్నారంటున్న సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క .. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతులకు ఆ భూమి మీద వారికి యాజమాన్య పట్టాలు ఇచ్చి వారికి బ్యాంక్ ల ద్వారా రుణ సదుపాయం కల్పించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినాక పోడు పట్టాలు రద్దు చేసిన తెరాస ప్రభుత్వం ఆ భూములు వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటూ అటవీ శాఖ అధికారులతో వారిని వేధిస్తుందని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు.
అందుకే ఆ రైతుల తరుపున వారికి అండగా నేను ఉన్నాను - నేను వస్తున్నాను అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు భట్టి విక్రమార్క పర్యటనలు చేస్తున్నారు. ఆయన నిన్న అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామాన్ని సందర్శించి పోడు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెల్సుకున్నారు. దమ్మపేట మండలం మందలపల్లి గ్రామం వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,అభిమానులు,సానుభూతిపరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
అయితే.. తెలంగాణ కాంగ్రెస్లో ఒక్కో నాయకుడిది ఒక్కో పంథా.. ఇలాంటి నేపథ్యంలో సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క .. ఇలా నేను ఉన్నాను.. నేను వస్తాను అంటూ పర్సనల్ ఇమేజ్ పెంచుకునే పర్యటన చేయడం పై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లో ఇలా వ్యకి కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. అయితే.. బాధితులకు సాంత్వన చేకూర్చడమే ప్రధానం తప్ప కార్యక్రమం పేర్లు కాదని సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వర్గం వాదిస్తోంది. మరి ఈ నేను ఉన్నాను.. నేను వస్తాను ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.