
జగన్ సంచలన నిర్ణయం: మోడీకి తలొంచినట్టేనా?
వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు వల్ల దాదాపు 30 శాతం విద్యుత్ ఆదా అయ్యిందని సీఎం జగన్ భావిస్తున్నారు. కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని సీఎం జగన్ విద్యుత్ శాఖపై జరిపిన సమీక్షలో తెలిపారు. రైతులు వాడని కరెంటును ఉచిత విద్యుత్ పేరు మీద ఇప్పటి వరకూ లెక్క కడుతున్నారని సీఎం జగన్ వివరించారు.
ఇలాంటి మీటర్ల కారణంగా వీటన్నింటికీ చెక్ పడే పరిస్థితి వచ్చిందంటున్న సీఎం జగన్.. మీటర్లతో పారదర్శక వ్యవస్థ ఏర్పడిందంటున్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు నాణ్యమైన కరెంటు అందుతోందని సీఎం జగన్ అంటున్నారు. అలాగే సిబ్బందిలోనూ జవాబుదారీతనం పెరిగిందని సీఎం జగన్ అన్నారు. అందుకే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చాలని సీఎం ఆదేశించారు.
అయితే.. రైతుల నుంచి ఈ నిర్ణయానికి గట్టి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మీటర్లు పాదర్శకత కోసమే అని చెబుతున్న ప్రభుత్వం.. ముందు.. ముందు.. ఈ మీటర్ల ఆధారంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకున్నా.. దాన్ని అమలు చేసేది లేదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెబుతున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మాత్రం మోదీ ఒత్తిడికి తలొగ్గి రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విమర్శిస్తున్నారు.