ఓ మైగాడ్‌.. చంద్రబాబుకు ఆ రెండూ లేవా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల పుట్టినరోజు జరుపుకున్నారు. ఏప్రిల్ 20 ఆయన పుట్టిన రోజు. ఆ రోజు.. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. అయితే.. ఆ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలు ఇఫ్పుడు వైసీపీ నేతలకు ఆయుధాలుగా మారుతున్నాయి. చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకొని శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఇవ్వాలని కోరుకున్నారట. ఈ విషయాన్ని చంద్రబాబే మీడియాతో చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేస్తున్నారు.


ఇక్కడే వైసీపీ నేతలు లాజిక్ లాగుతున్నారు. చంద్రబాబు అలా కోరారంటే.. ఇన్ని రోజులు అవి లేవని అయినా అనుకోవాలి.. లేదా పోయినవి మళ్లీ ఇవ్వమనైనా అడిగి ఉండాలంటున్నారు సజ్జల. చంద్రబాబుకు తెలివితేటలు అపారంగా ఉన్నాయని చెబుతున్న మాటలన్నీ బూటకమే కదా అంటున్నారు. అలాగే గత 40 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నమ్మించాలని చూస్తున్నాడో అవి లేవని.. అందుకే  కొత్తగా కావాలని దుర్గమ్మను కోరినట్టు చంద్రబాబు మాటల్లోనే తెలుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్‌ వేశారు.

 
చంద్రబాబు తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఇవ్వాలన్నా.. ఆయనకు మంచి మనసు, ఆలోచనలు ఉంటేనే దుర్గమ్మ కరుణ ఉంటుందంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇన్నాళ్లూ లేని తెలివితేటలు అర్జెంటుగా కావాల్సిన అవసరం ఏముందని సజ్జల ప్రశ్నించారు. అంతే కాదు.. దుర్గమ్మ గుడికి వెళ్లి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు అవే అడ్డగోలు మాటలు నేటికీ కొనసాగిస్తూనే ఉన్నాడని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.


అసలు సీఎం జగన్, వైయస్‌ఆర్‌ సీపీ, రాష్ట్ర ప్రజలను చంద్రబాబు అవహేళనగా మాట్లాడిన తీరు చూస్తే  ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగడం అవసరమా అనిపిస్తోందంటన్నారు సజ్జల. ఒక అబద్ధాన్ని చెప్పి చెప్పి దాన్ని నిజంగా చూపించాలని చంద్రబాబు తాపత్రయపడుతుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం ప్రశాంతంగా, కుళ్లు, కుతంత్రాలకు  దూరంగా ఉండాలంటే... చంద్రబాబు లాంటివారికి ఏ దేవుడు, ఏ దేవత అనుగ్రహం ఉండకూడదన్నారు సజ్జల.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: