చెప్పుతో కొట్టుకున్నా.. నీకు సీన్లేదులే.. కొత్తపల్లీ..!
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన కాపు నాయకుడు.. కొత్తపల్లి సుబ్బారాయుడు.. తాజాగా ఒక రాజకీయ విన్యాసం చేశారు. ఇటీవల నిర్వహించిన ఓ సభలో తన చెప్పుతో తనే బహిరంగంగా కొట్టుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజును ఎమ్మెల్యే అయ్యేందుకు తాను ఎంతో కృషి చేశానని.. కానీ, ఇప్పుడు తప్పు చేశానని భావిస్తున్నానని.. అందుకే తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని.. సుబ్బారాయుడు చెప్పుకొచ్చారు. అయితే.. ఈ విషయం వెనుక.. ఆయన అసంతృప్తి ఉందని.. త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు.
వాస్తవానికి కొత్తపల్లికి ఇప్పుడు వైసీపీలో ప్రాధాన్యం లేదు. గత ఎన్నికలకు ముందు.. టీడీపీకి రాం రాం పలికి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఈయన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశించారు. అయితే.. అది దక్కలేదు. పోనీ మరో నామినేటెడ్ పదవి అయినా.. దక్కుతుందని అనుకున్నా రు. కానీ, అది కూడా దక్కలేదు. దీంతో ఇక, పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుని.. ప్రజలను నమ్మించేందుకు.. ఆయన చెప్పు ప్రయోగం చేశారు. అయితే.. ఇప్పటికే సుబ్బారాయుడు చేసిన.. సినిమాలు గ్రహించిన.. ప్రజలు.. ఆయన ఎక్కడికి వెళ్లినా.. పట్టించుకునే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు.
గతంలో టీడీపీలో గెలిచి, విద్యుత్ శాఖ మంత్రి పదవిని కూడా చేసిన కొత్తపల్లి 2009లో ప్రజారాజ్యంలో చేరి(టీడీపీని వదిలేసి) పోటీ చేసి ఓడిపోయారు. 2012లో కాంగ్రెస్లో పోటీ చేసి విజయం దక్కించుకుని.. తర్వాత వైసీపీలో చేరిపోయారు. మళ్లీ 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో.. వైసీపీని వదిలేసి.. టీడీపీ పంచన చేరారు. ఈ క్రమంలోనే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు.
2019 ఎన్నికలకు ముందు టీడీపీ తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో.. వెంటనే వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రాధాన్యం దక్కడంలేదనే కారణంగా.. జనసేనవైపు చూస్తున్నారు. దీంతో ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితి లేదని.. అంటున్నారు పరిశీలకులు. ఆయనచెప్పు రాజకీయం.. ఏమాత్రం ఫలించే అవకాశం లేదని నిర్మొహమాటంగా చెబుతుండడం గమనార్హం.