ఆ విషయంలో జగన్ లాజిక్ కరెక్ట్ కాదా..?

ఏపీ సీఎం జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. వాటిని మరో 13కు పెంచిన మొత్తం 26 జిల్లాలు చేయాలన్నది జగన్ ఆలోచన. ఈ మేరకు అన్ని విధాలా కసరత్తు చేసి కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ కొత్త జిల్లాల ఏర్పాటునకు ప్రాతిపదిక ఏంటి.. అని అడిగితే.. ఒక్కో పార్లమెంటరీ నియోజక వర్గాన్ని ఒక్కో జిల్లాగా ప్రకటించాలన్నది జగన్ కాన్సెప్టు.. అయితే.. ఈ కాన్సెప్టు కొత్తదేమీ కాదు.. వైసీపీ ఎప్పటి నుంచో చెబుతున్నదే.. ఎన్నికల ముందు కూడా జగన్ ఈ విషయం చెప్పారు.


గతంలో చెప్పినట్టే ఆయన ఇప్పుడు ఏపీని మొత్తం 26 జిల్లాలుగా చేశారు. దీనిపై ముసాయిదా విడుదల చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు సేకరించి.. ఫైనల్‌ జాబితా రెడీ చేస్తారు. అయితే.. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రాతిపదికను తప్పుబడుతున్నారు కొందరు. ఎందుకంటే.. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయడం అనేదే కరెక్టు కాదంటున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ నియోజక వర్గాలు మరో నాలుగేళ్లలో మరోసారి పునర్వవస్థీకరణకు వస్తాయి.


మరి ఇప్పుడు ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. మరి మరో నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఎంపీ నియోజక వర్గాల సరిహద్దులు మారతాయి.. మరి అప్పుడు ఏం చేస్తారు.. అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు మళ్లీ జిల్లాల సరిహద్దులు మారుస్తారా.. అని అడుగుతున్నారు. ప్రస్తుత వ్యవస్థలో అసలు ఎంపీ నియోజక వర్గానికి అంత ప్రాధాన్యం లేదని.. ఎంపీ నియోజక వర్గం వారీగా పరిపాలన జరగదని.. మరి అలాంటప్పుడు ఎంపీ నియోజక వర్గం వారీగా విభజన ఎందుకని ప్రశ్నిస్తున్నారు.


ఇప్పుడు చేసిన కొత్త జిల్లాలను మళ్లీ 2026లో ఎంపీ నియోజక వర్గాల పునర్విభజన తర్వాత మళ్లీ మారుస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న సహేతుకంగానే ఉంది. కేవలం 4 ఏళ్ల కోసం ఇప్పుడు ఈ మార్పులు చేస్తే.. 2026 తర్వాత పరిస్థితి ఏంటన్నది ఆలోచించాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: