వామ్మో.. మూడేళ్లలో 6 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్..?
అయితే.. గడిచిన మూడేళ్లలో చేసిన అప్పు విపరీతంగా పెరిగిపోయందని నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. ఈ మూడేళ్లలో జగన్ సర్కారు ఏకంగా రూ.6లక్షల70 వేల కోట్లు అప్పు చేసిందని నాదెండ్ల మనోహర్ లెక్కలు చెబుతున్నారు. ఈ అప్పుల విషయంలో ప్రభుత్వం తాజాగా ఇచ్చిన 12 పేజీల శ్వేతపత్రం అవాస్తవం అని విమర్శిస్తున్నారు నాదెండ్ల మనోహర్. చేపల చెరువుల ఆన్లైన్ వేలంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని.. వేలానికి సంబంధించి 217 జీవోను ఉపసంహరించుకోవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే అప్పుల విషయంలో ఇలా ప్రతిపక్షాలు చేసే విమర్శల్లో అనేక కోణాలు ఉంటాయి. అంతే కాదు.. అసలు అప్పుల విషయంలోనే కేంద్రం కొన్ని నిబంధనలు విధిస్తుంది. అంతకు మించి అప్పులు తెచ్చే వెసులుబాటు కూడా ఉండదు. రాష్ట్రాలు ఇష్టానుసారం అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కేంద్రం ఎఫ్ ఆర్ బీ ఎం చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ప్రతి రాష్ట్రం కూడా తాను చేయాల్సిన అప్పు గురించి ఓ స్పష్టమై అవగాహన ఉంటుంది. ఆ రాష్ట్ర జీడీపీ ఆధారంగా ఆ రాష్ట్రం ఎంత వరకూ అప్పులకు వెళ్లవచ్చన్నది కేంద్రం నిర్ణయించి చెబుతుంది.
జగన్ సర్కారు విషయంలోనూ అదే జరుగుతుంది. అయితే.. విపక్షాలు చేసే ఆరోపణ ఏంటంటే.. జగన్ సర్కారు ఎఫ్ ఆర్ బీ ఎం చట్టాన్ని కూడా జగన్ సర్కారు పట్టించుకోకుండా నిబంధనలను తోసి రాజని అప్పులు చేస్తోందట. అయితే.. ఈ విషయంలో కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా.. కాగ్ వంటి వ్యవస్థలు రాష్ట్రాల అప్పుల జోరును అడ్డుకోకుండా ఉంటాయా.. జగన్ సర్కారు అన్ని వ్యవస్థలను కళ్లు కప్పి అప్పులు తెస్తుందా అన్నది తేలాల్సి ఉంది.