మోడీకి షాక్‌ ఇచ్చిన కేసీఆర్‌.. ప్రివిలేజ్‌ నోటీస్‌..?

బీజేపీ, టీఆర్ఎస్‌ వార్ పతాక స్థాయికి చేరుతోంది. వచ్చిన ఏ అవకాశాన్ని ఏ పార్టీ కూడా వదలడం లేదు. తాజాగా టీఆర్‌ఎస్‌ ఏకంగా ప్రధాని మోడీకే షాక్ ఇచ్చింది. పార్లమెంట్‌లో ఆయన ఉమ్మడి ఏపీ విభజనపై చేసిన ప్రసంగంపై ఏకంగా ప్రధానిపై ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చింది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేశవరావు, సంతోష్‌, సురేష్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ అందజేశారు.


సోమవారం రాజ్యసభలో ప్రధాని తన ప్రసంగంలో తెలంగాణ బిల్లు గురించి అభ్యంతరకరంగా మాట్లాడారని టీఆర్ఎస్‌ ఆ నోటీసుల్లో పేర్కొంది. పార్లమెంట్‌లోని 187వ నిబంధన కింద నోటీసు ఇచ్చినట్లు టీఆర్‌ఎస్‌ చెబుతోంది. ఇంతకీ ప్రధాని ఏం మాట్లాడారు.. ఆయన మాట్లాడింది ఎందుకు ప్రివిలేజ్‌ కిందకు వస్తుంది.. తెలుసుకుందాం.. ప్రధాని మొన్న సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం అంటే గిట్టదని విమర్శించారు.


కాంగ్రెస్‌ తీరును ఎండగట్టే క్రమంలో ఆయన ఏపీ విభజన తీరును ప్రస్తావించారు. పార్లమెంటులు తలుపులు మూసేసి.. లైట్లు ఆపేసి.. మిర్చి స్ప్రేలు చల్లి మరీ విభజన బిల్లును ఆమోదించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇలా ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదించిన తీరు SHAMEFUL అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీఆర్ఎస్‌ ఈ ప్రసంగంలోని SHAMEFUL అన్న పదాన్ని అభ్యంతర కరంగా పేర్కొంటుంది.


ఈ పదం ఆధారంగా ప్రధాని మోదీ పార్లమెంట్‌ సభ్యుల ప్రివేలేజ్‌కు భంగం కలిగించారన్న కోణంలో ఈ నోటీసు ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ నోటీసు ఇస్తే ఏమవుతుంది.. తదుపరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నోటీసుపై రాజ్యసభ ఛైర్మన్‌ నిర్ణయం తీసుకుంటారు. రాజ్యసభలో నోటీసు ఇచ్చారు కాబట్టి ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన దీనిపై చర్చకు అనుమతిస్తే.. ఈ అంశంపై చర్చిస్తారు. తదుపరి ఓటింగ్‌ ఉంటుందా ఉండదా అనేదానిపై స్పష్టత లేదు. అయితే బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉన్నందువల్ల ఓటింగ్‌తో వచ్చే ఇబ్బందేమీ ఉండదు. కాకపోతే.. కాస్త రాజకీయ రచ్చ, మైలేజీ వస్తాయన్నదే టీఆర్ఎస్‌ వ్యూహం కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: