బాబు వ్యూహం అర్థం కాక జుట్టుపీక్కుంటున్న వైసీపీ..?

ఇప్పుడంటే కాస్త ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి కానీ.. నారా చంద్రబాబు నాయుడికి రాజకీయ వ్యూహకర్తగా మంచి పేరుంది. ఆయన్ను అప్పట్లో చాణక్యుడితో పోల్చేవారు. అయితే అలా పోల్చిన వాటిలో ఎక్కువగా అనుకూల మీడియానే ఉండేదనుకోండి.. కానీ అప్పట్లో అసలు పోటీ మీడియా అంటూ ఒకటి ఉంటేగా.. ఈ విషయాలన్నీ విప్పి చెప్పడానికి.. అలాంటి సమయంలో చంద్రబాబు చాలా చక్రాలు చాలా చోట్ల చాలా చాకచక్యంగా తిప్పాడు. అయితే తాజాగా ఆయన పన్నిన ఓ వ్యూహం మాత్రం వైసీపీ నేతలకు అంతుచిక్కడం లేదు.

అదేమింటంటే.. ఇప్పుడు తాజాగా నారా చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా జనంలోకి వస్తున్నారు. ఆమె ఎన్టీఆర్ ట్రస్టు తరపున వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకుంటున్నారు. వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు తరపున చెక్కులు అందిస్తున్నారు. బాధితులతో కలిసి మాట్లాడుతున్నారు. ఇందులో పెద్ద విశేషం ఏముందంటారా.. ఉంది.. నారా భువనేశ్వరి గతంలో ఎన్నడూ ఇలా స్వయంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.. ఒకటీ అరా హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాలకు హాజరుకావచ్చు కానీ.. ఇలా జిల్లాల్లో తిరుగుతూ సామాజిక సేవ కార్యక్రమాలు చేసిన చరిత్ర చాలా తక్కువ.

మరి ఉన్నట్టుండి ఆమె ఎందుకు పబ్లిక్ లైఫ్‌లోకి వస్తున్నారు.. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు అంతుబట్టని ప్రశ్నగా వైసీపీ నేతలకు మారింది. చంద్రబాబు ఆమెను ఎందుకు ఇలా పర్యటనలకు పంపుతున్నారు.. ముందు ముందు పార్టీ కార్యక్రమాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటారా.. లేక సామాజిక సేవకే పరిమితం అవుతారా.. అన్నది అర్థం కాకుండా ఉంది. నారా లోకేశ్‌పై నమ్మకం లేక చంద్రబాబు భార్యను రంగంలోకి దింపారన్న వాదన కూడా ఉంది. కానీ అది అంత సబబుగా కనిపించడం లేదు.

అయితే ఇందులో అంత పెద్ద వ్యూహం ఏమీ ఉండకపోవచ్చని.. ఇటీవల అసెంబ్లీలో భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం వైసీపీ గ్రాఫ్ తగ్గించిందని.. ఆ ఇష్యూను ఇంకా జనం దృష్టిలోనే ఉంంచేందుకు.. అప్పుడే మరచిపోకుండా చూసేందుకే చంద్రబాబు నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా పర్యటనకు వ్యూహం రచించాడని భావిస్తున్నారు. ఇంతకీ ఏంటి అసలు కారణం అన్నది మాత్రం ఇంకా వైసీపీ నేతలకు అది ప్రశ్నార్థకంగానే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: