హుజురాబాద్: కేసీఆర్ను నేలకు దింపిన ఈటల..!?
కేసీఆర్ రెండోసారి వరుసగా ఎన్నికల్లో విజయం సాధించిన ఏడాది వరకూ అసలు కేసీఆర్ ఉనికి పెద్దగా కనిపించలేదు. సీఎం సచివాలయానికి హాజరు కాడు.. అటు ప్రగతి భవన్లోకి ప్రజలకు అంత సులభంగా దర్శనం దొరకదు. ఏ కార్యక్రమం అయినా మంత్రులు చూసుకోవాల్సిందే. మహా అయితే కేటీఆర్ అధ్యక్షతన కొన్ని సమీక్షలు జరుగుతాయ్.. ఇక కేసీఆర్ వీలైతే ప్రగతి భవన్.. లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌజ్.. ఇలాగే ఉండేది పరిస్థితి.
అయితే ఈటల రాజేందర్ ఎపిసోడ్తో సీన్ చాలా మారిపోయింది. ఈటలను టార్గెట్ చేసిన తర్వాత కేసీఆర్ మెల్లగా జనంలోకి రావడం మొదలు పెట్టారు. కరోనా సమయంలో ఎక్కడా పెద్దగా బయటకు రాని కేసీఆర్.. మాస్కు లేకుండా గాంధీ ఆసుపత్రికి వచ్చి షాక్ ఇచ్చారు. అంతే కాదు.. ఆ తర్వాత విరివిగా జిల్లాల్లో పర్యటనలు చేశారు. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నానని చెప్పారు. ఆ గ్రామానికి వెళ్లి భోజనాలు చేసి.. అనేక వరాలు ప్రకటించి మరీ వచ్చారు.
ఇక ఆ తర్వాత దళితుల కోసం దళిత బంధు రూపొందించారు. అప్పటి వరకూ దళిత అధికారులను ఆమడ దూరం పెట్టిన కేసీఆర్ ఏకంగా సీఎంఓలోనూ ఓ దళిత ఐఏఎస్ను నియమించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా డప్పు కొట్టి మరీ చెప్పుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో ఉదాహరణలు.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈటల కేసీఆర్ను నేలకు దింపాడు.. ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో ఎవరైనా గెలవనీ గాక.. ఈటల మాత్రం నైతికంగా ముందే గెలిచాడు.