వావ్.. ఇక ఏపీకి పరిశ్రమలే పరిశ్రమలు..?

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రాబోతున్నాయా.. వరుసగా కంపెనీలన్నీ ఏపీకి క్యూ కట్టబోతున్నాయా.. ఇప్పటికే అనేక పరిశ్రమలు ఏపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయా.. అంటే.. అవునంటోంది ఏపీ ప్రభుత్వం.. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన  స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం వివరాలు అలాగే ఉన్నాయి మరి.  తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పరిశ్రమలపై సమీక్ష చేపట్టారు.

ఈ సమీక్షలో పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. రూ.7500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జిందాల్‌ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్‌ ఏపీలో పరిశ్రమ పెట్టబోతోంది. ఏపీలో ఏర్పాటయ్యే కంపెనీలో  75శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పరిశ్రమల వల్ల పర్యావరణంపై  ప్రభావాన్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు సీఎం. జాగ్రత్తలు తీసుకుంటూ పారిశ్రామిక ప్రగతిలో ముందడుగు వేయాలని సూచించారు.


కడప సమీపంలో కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్‌ ఇంజినీరింగ్‌ కాంపోనెంట్స్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు అంగీకారం తెలిపింది. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీంలో గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణకు బోర్డు ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమకు బోర్డు అంగీకారం చెప్పింది. నెల్లూరు జిల్లాలో  జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ఖర్చుకు  ఇచ్చేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.



ఇవే కాకుండా చిల్లకూరు మండలం మోమిడి గ్రామం తమ్మినపట్నం వద్ద జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ కు భూమి ఇచ్చేందుకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. 2.25 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జిందాల్ స్టీల్‌‌ ఆంధ్రా లిమిటెడ్‌ ఏర్పాట్లు చేయబోతోంది. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో నిర్మాణం అవుతున్న సెయింట్‌ గోబియాన్‌ పరిశ్రమకు ఏర్పాటుకు డెడ్‌లైన్‌ను పొడిగింపునకు ఎస్‌ఐపీబీ ఓకే చెప్పింది. ఈ పరిశ్రమలన్నీ వస్తే బాగానే ఉద్యోగాలు దొరుకుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: