జగన్ కోసం.. పీకల్లోతు చిక్కుల్లో పడ్డ ఆ ఇద్దరు..?

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు.. పరిపాలనకు కళ్లూ, చెవులు. కానీ.. వారిని ఆడించేది అధికారంలో ఉన్న రాజకీయ నాయకులే. కానీ.. అధికారంలో ఉన్నవారు చెప్పినట్టల్లా చేస్తే ఐఏఎస్‌, ఐపీఎస్‌లు చిక్కుల్లో పడక తప్పదు. ఇందుకు తాజా ఉదాహరణలుగా కనిపిస్తున్నారు మాజీ సీఎస్‌ నీలం సాహ్నీ, సీఐడీ డీజీ సునీల్‌ కుమార్.. నీలం సాహ్నీ జగన్ సర్కారులో సీఎస్‌గా పని చేశారు. జగన్ తో ఆమెకు మంచి సంబంధాలే ఉండేవి. జగన్ సర్కారు నిర్ణయాలకు ఆమె సీఎస్‌గా ఏనాడూ అడ్డు చెప్పలేదు.

కానీ.. ఎంతటి వివాదాస్పద నిర్ణయం అయినా సరే.. నీలం సాహ్నీ సీఎం ఆదేశాలను తుచా తప్పకుండా పాటించేవారు. అందుకే సాహ్నీ సహకారానికి మెచ్చిన జగన్.. ఆమెను పదవీ విరమణ చేసిన వెంటనే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. అయితే ఆ పదవిలోనూ ఆమె జగన్ చెప్పినట్టే చేశారు. ఇప్పుడు అందుకు ఆమె తగిన ఫలితం అనుభవిస్తున్నారు. ఆమె విషయంలో తాజాగా హైకోర్టు చేసిన కామెంట్లు చూస్తే.. ఆమెపై జాలి కలగక మానదు.

అసలు నీలం సాహ్నీ ఎస్‌ఈసీగా తగిన వ్యక్తేనా అని హైకోర్టు కామెంట్ చేసిందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పులో అంత స్పష్టంగా చెప్పాక కూడా సాహ్నీ వక్ర భాష్యాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆంగ్ల భాషను చదవడం, రాయడం, అర్థం చేసుకోగలిగే సామాన్యులకు.. సుప్రీంకోర్టు మార్గదర్శనం ఇట్టే అర్థం అవుతుందని.. రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి ఇప్పుడు ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే ఎన్నికల కమిషనర్‌గా ఆమె తగినవారా, అర్హత కలిగినవారా అనే సందేహం తలెత్తుతోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ తీర్పులో వ్యాఖ్యానించారు.

ఇక మరో అధికారి ఐపీఎస్ సునీల్ కుమార్. రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై ఆయన సుమోటోగా విచారణ చేసి కేసు నమోదు చేశారు. అంతే కాదు.. పుట్టినరోజు నాడే ఎంపీని అరెస్టు చేశారు. సీఐడీ కస్టడీలో రఘురామకు గాయాలయ్యాయి. సుప్రీంకోర్టు ఎంపీని సీఐడీ ఇల్‌ ట్రీట్‌ చేసినట్టు కనిపిస్తోందని కామెంట్ చేసింది. మరి సాహ్నీ, సునీల్ వంటి వారు జగన్ చెప్పినట్టల్లా చేసి ఇప్పుడు చిక్కుల్లోపడ్డారన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: