శైలజా టీచర్‌ డోంట్ వర్రీ.. 2026లో మీరే సీఎం..?

శైలజా టీచర్‌కు మంత్రి పదవి దక్కలేదు.. ఇది రెండు మూడు రోజులుగా కేరళతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం. ఎందుకంటే.. గతంలో నిఫా వైరస్ సమయంలోనూ, కరోనా మొదటి వేవ్ సమయంలోనూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కెకే శైలజ సమర్థవంతంగా పనిచేశారు. ఆమె చిత్తశుద్ధిని పనితనాన్ని ప్రపంచమంతా ప్రశంసించింది. అందుకే కొత్త కేబినెట్‌లో శైలజా టీచర్ లేకపోవడంపై సోషల్ మీడియాలో పలువురు విజయన్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తంచేస్తున్నారు.

అయితే.. తనకు మంత్రివర్గంలో చోటుదక్కకపోవడాన్ని శైలజ పాజిటివ్‌గానే తీసుకున్నారు. కేవలం తనను మాత్రమే ఆపలేదని, చాలా మంది మంత్రులను కూడా కేబినెట్‌లో తీసుకోవడం లేదని శైలజ గుర్తు చేస్తున్నారు. పార్టీకి నాయకత్వ సమస్య రాకూడదని.. కొత్త తరాన్ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. బెంగాల్‌లో పార్టీ పతనానికి ఈ పార్టీ ముందుచూపు లేకపోవడం ఇందుకు కారణమని భావిస్తున్న కేరళ కమ్యూనిస్టులు.. ఇక్కడ అలాంటి సమస్య రాకూడదని కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొత్త వారికే ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఈ నిర్ణయం శైలజా టీచర్‌కు మేలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఆమెకు మంత్రి వర్గంలో చోటు దక్కకపోయినా.. భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి తానే అవుతారని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని పినరయి విజయన్ ఇప్పటికే చెప్పేశారు. మరోసారి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం లేదు.

అందుకే మూడోసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే శైలజ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని అంచనా వేస్తున్నారు. అందుకే భవిష్యత్ ముఖ్యమంత్రిగా కేరళ ప్రజలు ఆమెను కీర్తిస్తున్న వేళ పార్టీ నిర్ణయం పరోక్షంగా ఆమెకు మేలు చేయబోతోందన్నమాట. ప్రస్తుతం కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదంటున్న శైలజను పార్టీ విప్‌ గా అవకాశం ఇచ్చిన విషయం మరువకూడదు. ఈ ఐదేళ్లు ఆమె ఇదే చిత్తశుద్ధితో పని చేస్తే.. వచ్చేఎన్నికల్లో ఆమె సీఎం అభ్యర్థి కావడం కష్టమేమీ కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: